Tuesday, September 17, 2024

20 లక్షల ఎకరాల్లో పంట నష్టం!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం లో కురిసిన కుంభవృష్టి పంట పొలాలను ముంచెత్తింది. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. పలు జిల్లాలో చెరువులకు గండ్లు పడ్డా యి. కాలువగట్లు తెగిపోయాయి. ఉత్తర తెలంగాణలో వర్షబీభత్సం వ్యవసాయరంగాన్ని చిదిమేసింది. వరి పత్తి , మిరప మొక్కజొన్న , కంది తదితర రకాల పైర్ల వరదనీట మునకేశాయి. కొన్ని జిల్లాలోని వాగుల సమీప పొలాలలో ఇసుక మేటలు వేశాయి.వ్యవసాయశాఖ ప్రాధమిక అంచనాల మేరకు 20లక్షల ఎకరాల్లో వివిధ రకాల పైర్లకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లా వ్యవసాయరంగానికి భారీ నష్టం వాటిల్లింది. మున్నేరు ఉగ్రరూపం పంట పొలాలను చిదిమేసింది. నదిలో తొలిసారి 36అడుగుల మేర నీరు ఉప్పొంగి ప్రవహించి సమీప గ్రామాల పంటపొలాలను ముంచెత్తింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ప్రాధమిక అంచనాల మేరకు 60వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి.చింతకాని మండలంలోనే 26682ఎకరాల్లో వరి ,24791 ఎకరాల్లో పత్తి పైర్లు దెబ్బదిన్నాయి. మరో 4500ఎకరాల్లో మిరప పంట దెబ్బతింది.

వీటితోపాటు మొక్కజొన్న,పెసర, అరటి , బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి.జిల్లాలోని పాలేరుకు రికార్డు స్థాయిలో 1.60లక్షలక్యూసెక్కుల వరద నదికి ఇరువైపులా పంట పొలాలను తుడిచిపెట్టింది.వేల ఎకరాలు నీటమునిగాయి. పాలేరు అనుసంధాన కాల్వ కట్ట తెగిపోయింది. మల్లాలయిగూడెం కాల్వకు గండి పడింది. వేలాది గ్రామాలకు చెందిన వరి పొలాలు వరదనీటిలో మునిగి చెరువులను తలపించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల వల్ల 3వేల ఎకరాల్లో పైర్లకు నష్ట వాటిల్లిందిజ వరి 1647ఎకరాలు, పత్తి 13 ఎకరాలు, పత్తి 1323ఎకరాలు ఇతర పంటల మరో వెయ్యి ఎకరాల్లో దెబ్బతిన్నట్టు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు తెలిపారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేలాది ఎకరాల్లో పైర్లు నీటమునిగాయి. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు 132.5కి.మి వద్ద , 134.5కి.మి వద్ద గండ్లు పడ్డాయి.దీంతో సాగర్ జలాలు సమీపాన ఉన్న వేలాది ఎకారల పైర్లను ముంచెత్తాయి. సుమారు ఎనిమిది అడుగుల ఎత్తున పొలాల్లో నీరు చేరింది. ప్రాధమిక సమాచారం మేరకు 2000ఎకరాల్లో పైర్లు దెబ్బతిన్నాయి.

అయితే దెబ్బతిన్న పైర్ల విస్తీర్ణం ఇంకా అధికంగానే ఉంటుందని చెబుతున్నారు. సూర్యాపేట మండలం పిల్లలమర్రి పిన్నాయపాలెం వద్ద మూసి ఎడమకాలువకు గండిపడింది. మూసీ వరద పంటపొలాలవైపు పరుగుల తీసి గంటలోనే వేల ఎకరాల్లో పైర్లను ముంచెత్తింది.హుజూర్ నగర మండలంలో బూరుగడ్డ ,గోపాల పురం చెరువుల తెగిపోయి పంటపోలాలు నీటమునిగాయి. నాగుల చెరువుకు గండి పండి చెరువునీరు పొలాలను ముంచెత్తింది. యాదాద్రి జిల్లాలో కొండపోచమ్మ కాలువకు గండిపడి నీరంతా పొలాలను కప్పేసింది.నిజామాబాద్ జిల్లాలో మంజీరానదిలో వరదనీరు ఉప్పొంగింది. గోలిలింగాల, వాడి,నాగిరెడ్డిపేట ,వెంకుపలి తాండూరు, మాటూరు , ఆత్మకూరు గ్రామాల్లో పంటపోలాలు నీటమునిగాయి. మెదక్ జిల్లాలో నారింజవాగు ఉప్పొంగింది. వాగు పరివాహకంగా ఉన్న వేలాది ఎకరాలు నీటమునిగాయి. ఊట్ల చెరువు కొతకు గురై చెరవు నీరు పంటపొలాల్లోకి పరుగులు తీసింది.అదిలాబాద్ జిల్లాలో తాంసి , భీంపూర్ , అదిలాబాద్ ,నార్నూర్ మండలాల్లో వాగులు ఉప్పొంగి వేలాది ఎకరాల్లో పత్తి పొలాలను ముంచెత్తాయి.

వరంగల్ జిల్లాలో 6500 ఎకరాల్లో వివిధ రకాల పైర్లు దెబ్బతిన్నాయి. నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి , పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. కూరగాయ పంటలు కూడ దెబ్బతిన్నాయి.పంటనష్టాలపై సమగ్ర సర్వే చేపడుతున్నట్టు జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ వెల్లడించారు.
భారీగా పత్తి వరిపైర్లకు నష్టం :
భారీ వర్షాలు వరదల కారణంగా వ్యవసాయరంగానికి జరిగిన నష్టంలో వరి ,పత్తి పైర్లకే అత్యధికంగా నష్టం వాటిల్లినట్టు సమాచారం . వివిధ జిల్లాలనుంచి అందిన ప్రాధమిక సమాచారం మేరకు 20లక్షల ఎకరాల్లో పైర్లు దెబ్బతినగా అందులో 10లక్షల ఎకరాల్లో పత్తి పైర్లు నీటమునిగాయి. మరో 6లక్షల ఎకరాల్లో వరి పైర్లు మునకేశాయి. మిరప మరో 3వేల ఎకరాల్లో దెబ్బతింది. ఇతర రకాల పైర్లు మరో వెయ్యి ఎకరాల మేరకు నష్టపోయినట్టు సమాచారం .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News