Sunday, September 8, 2024

కరెంట్ మంట

- Advertisement -
- Advertisement -
పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఆగ్రహం
అది రైతుల పాలిట రాబందు పార్టీ
24గంటల వెలుగులు కావాలా..మళ్లీ కటిక చీకట్ల కాంగ్రెస్సా?
కాంగ్రెస్ హయాంలో రైతులు పడ్డ కష్టాలు తెలంగాణ సమాజం మరువదు
మోటార్లకు మీటర్లు పెట్టాలని మెడపై కేంద్రం కత్తి పెట్టినా బిఆర్‌ఎస్ ప్రభుత్వం లొంగలేదు
ఉచిత విద్యుత్  వద్దన్నోళ్లను ఊరి పొలిమేరల దాకా ఉరికించండి
రేవంత్‌పై మంత్రి కెటిఆర్ ధ్వజం, కాంగ్రెస్ దిష్టి బొమ్మల దహనానికి పిలుపు

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రైతులను చంపుకుతినే రాబందు అని మరోసారి తేలిపోయిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి. రామారావు అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని కాంగ్రెస్ చేసిన ప్రకటన ఆ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమ ని పేర్కొన్నారు. 24 గంటల కరెంట్ రద్దు చేసి…3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని చెప్పడం కాం గ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ఠ అని మండిపడ్డా రు. తెలంగాణ రైతుకు ఉచిత విద్యుత్ ఊపిరిలాంటిదని, రైతుల ఊపిరిని ఆపేస్తామని, అన్నదాత ఉ సురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్ధికి తార్కాణమని విమర్శించారు. ఈ మేరకు మంత్రి కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్నటిదాకా ధరణి రద్దు.. రైతుబంధు వద్దూ అంటూ ఇప్పటికే రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్, ఇప్పుడు ఏకంగా ఫ్రీ కరెంట్‌ను ఎత్తేస్తామన్న తన క్రూరమైన ఆలోచనను బయటపెట్టుకుందని చెప్పారు. ఉచిత విద్యుత్‌కు ఉరి వేసేందుకు గాంధీ భవన్ కేంద్రంగా జరుగుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని కెటిఆర్ తెలంగాణ రైతాంగానికి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ కాలంలో అన్నదాతలు అరిగోస పడ్డారు
కాంగ్రెస్ కాలంలో తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు..అనుభవించిన బాధలను తెలంగాణ ఎన్నటి మర్చిపోదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కాలంలో కరువులు.. కన్నీళ్లు.. కటిక చీకట్లు.. అప్పులు.. ఆత్మహత్యలతో అన్నదాతలు అరిగోస పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ రాకడ.. ప్రాణం పోకడ తెలియదన్నట్టుగా ఆనాడు విద్యుత్ కోతలతో… చాలీ చాలని 3 గంటల నాసిరకం కరెంట్‌తో రైతులు నరకం అనుభవించారని ధ్వజమెత్తారు. కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లతో ఎండిన పంటలు.. రైతుల ధర్నాలు.. సబ్ స్టేషన్లుపై దాడులతో పరిస్థితులు దారుణంగా వుండేవని, అలాంటి దుర్భరమైన పరిస్ధితులు గత 9 ఎళ్లుగా మారిపోయాయని తెలిపారు. అర్ధరాత్రి అపరాత్రి దొంగరాత్రి మోటార్లు పెట్టడానికి పోయి పాములు కుట్టి..కరెంట్ షాకులు కొట్టి మృత్యువాత పడ్డ రైతులు కాంగ్రెస్ పాలన పరిస్ధితులను తలుచుకునేందుకు కూడా సిద్దంగా లేరని చెప్పారు. ఒక్క కరెంటే కాదు… నాడు కాంగ్రెస్ హయాంలో ఎరువులను పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్మే దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. కిలోమీటర్లు దూరం క్యూలైన్లలో చెప్పులు.. లాఠీచార్జీల దృశ్యాలే కాంగ్రెస్ పాలనా పాడుకాలంలో ఉండేవని అన్నారు. కాంగ్రెస్ కల్తీ పాలనలో రైతులకు దొరికింది కల్తీ విత్తనాలు..కల్తీ పురుగు మందులే అని పేర్కొన్నారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం కరెంట్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగాన్ని రక్షించుకోవడానికి ..వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడానికి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని కెటిఆర్ తెలిపారు. ఇక్కడ సాగురంగానికి కరెంట్ ప్రాణావసరం అని గుర్తించి.. విద్యుత్ రంగంపై వేల కోట్లు వెచ్చించి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించిందని చెప్పారు. కాళేశ్వరం.. మిషన్ కాకతీయ.. ఇతర ప్రాజెక్టుల వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి 27 లక్షల బోరుబావుల కింద అన్నదాతలు రెండు పంటలు పండించుకొని సంతోషంగా వున్నారని అన్నారు. రైతుపచ్చగా వుంటే చూసి కళ్లుమండిన కాంగ్రెస్ శక్తులు నిరంతరం ఏవో కుట్రలు చేస్తూనే ఉన్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి సర్కారు.. ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసి మోటర్లుకు మీటర్లు పెట్టాలని రాష్ట్రం మెడపైన కత్తిపెట్టినా ప్రభుత్వం లొంగిపోలేదని తెలిపారు. 24 గంటల ఉచిత కరెంట్‌ను కాపాడుకోవడం కోసం ఏకంగా 30 వేల కోట్ల రూపాయలను వదులుకున్నది తప్ప రైతుల ప్రయోజనాలపై రాజీపడబోమని కెటిఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి కళ్లు మండుతున్నాయి
దేశానికే అన్నం పెట్టే స్థితికి ఎదిగిన తెలంగాణ అన్నదాతను చూసి కాంగ్రెస్ పార్టీకి కళ్లు మండుతున్నాయని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. రైతులు బాగుపడటం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పచ్చివిషం గక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ వున్న చిక్కుల్ని తొలిగించి.. పక్కా రక్షణనిచ్చిన ధరణి పోర్టల్‌ను రద్దుచేస్తామంటున్న కాంగ్రెస్.. మళ్లీ నాటి బ్రోకర్లు.. దళారుల భూదందాల కాలాన్ని తీసుకొస్తామని నిస్సిగ్గుగా ప్రకటించిందని దుయ్యబట్టారు. అదీ చాలక..24 గంటల ఉచిత విద్యుత్ అవసరమే లేదని.. మళ్లీ నాటి కాంగ్రెస్ చీకటి కాలాన్ని తిరిగితెస్తామని సిగ్గులేకుండా చెబుతున్నదనీ కెటిఆర్ అన్నారు. ఈ 24 గంటల వెలుగుల్ని వదులుకుందామా..? కటిక కాంగ్రెస్ చీకట్ల కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా..? చైతన్యవంతమైన తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలని కోరారు. ఉచిత విద్యుత్ వద్దన్నవాడిని ఊరి పొలిమేర్లకు రాకుండా ఉరికించాలని పిలుపునిచ్చారు. మూడు గంటల కరెంట్ చాలు అన్నవాడి మాడు పగిలేలా జవాబు చెప్పాలన్నారు. రైతులను పొడుచుకుతింటానికి కాచుకు కూర్చున్న కాంగ్రెస్ రాబందుల్ని తరిమికొట్టి.. రైతుబంధువులకు అండగా నిలవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
రాష్ట్రంలో ఉచిత కరెంట్‌పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలు మాత్రమే ఫ్రీ కరెంట్ ఇస్తామని, ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరాయ విద్యు త్ ఎందుకు అన్నట్లుగా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన లు కొనసాగిస్తున్నారు. పలుచోట్ల దిష్టి బొమ్మల దహనాలు చేపట్టారు. ఉచిత విద్యుత్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలన నిరసరగా బుధవారం కూడా బిఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన కొ నసాగించనున్నారు. విద్యుత్ సౌదా వద్ద బుధవారం నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత, దానం నాగేందర్, తదితర నేతలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News