Wednesday, October 23, 2024

‘దక్కన్’ దగా!

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ కేంద్రంగా నాలుగు దశాబ్దాల కిందట (1995) నెలకొల్పిన దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీకి (డిడిఎస్) దేశ, విదేశాల్లో మంచి పేరు ఉంది. మహి ళా సాధికారత కోసం కృషి చేస్తోన్న సంస్థగా గుర్తించి అనేక అంతర్జాతీయ సంస్థల నుంచి అవార్డులు, రివార్డులు వచ్చా యి. దేశ, విదేశీ సంస్థల నుంచి భూరి విరాళాలు వరదలా పోటెత్తాయి. ఈ సంస్థకు అంతర్జాతీయంగా లభించిన ఆదర ణ, మహిళా సాధికారిత, ఆదాయ వనరుల పెంపు వంటి కృషి కి మెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఏటేటా కోట్లాది రూ పాయాల గ్రాంట్లు, ఈ సంఘాలకు రివాల్వింగ్ ఫండ్‌ను మం జూరు చేశాయి. వెరిసి అనతికాలంలోనే డిడిఎస్ మహిళా సం ఘాల పరస్పర సహాయక పొదుపు సంఘాలు 75 గ్రామాలకు విస్తరించాయి.

దాదాపు 5వేల మంది నిరుపేద మహిళా స భ్యులుగా ఉన్నారు. ఈ సంఘాల్లోని సభ్యుల్లో 90శాతం మం ది దళితులు కాగా, మిగతా వారు బీసీలు, మైనార్టీలు. ఈ సం స్థ ఒక్కోమెట్టు 40ఏండ్లలో సాధించిన ప్రగతికి ప్రతిఫలంగా తమ సంఘాల పేరిట సుమారు 180 ఎకరాల వ్యవసాయ భూమి, బాల్వాడీల నిర్వహణకు సంఘాలు కొనుగోలు చేసిన స్థలాలు సమకూరాయి. దేశ, విదేశీ సంస్థల నుంచి వి రాళాలతో పాటు సంఘం సభ్యులు పొదుపు చేసిన డబ్బులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన రివాల్వింగ్ ఫండ్ కలిపి ఆయా బ్యాంకుల్లో కోట్లాది రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి.ప్రతి ఏటా పెద్ద ఎత్తున నిర్వహించిన ‘పాత పంటల పండుగ’, ఆకు కూరల పండుగ, చిరు ధాన్యాల జా తర వంటి వేడుకలకు దేశ, విదేశాల నుంచి పెద్దఎత్తునా ప్రతినిధులు హాజరయ్యేవారు. ఈ సంస్థకు  వచ్చిన పేరు ప్రఖ్యాతల కా రణంగా పేరుగాంచిన ఎన్జీవోలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప ర్యావరణవేత్తలు, బడా పారిశ్రామిక వేత్తలు ఈ సంస్థలో భాగస్వామ్యం కావడానికి ఒక దశలో పోటి పడేస్థాయికి ఎదిగిం ది. దీంతో ఎన్జీవోల విరాళాలు, ప్రభుత్వ గ్రాంట్లు మరింత పె రిగాయి. మరోవైపు మహిళా సంఘాల సభ్యులు పైసా…పైసా తమ స్థోమతకు తగ్గట్టుగా అకౌంట్లలో జమ చేయడంతో అసలు, వడ్డీ కలిపి అవీ నాలుగు, ఐదింతలు రెట్టింపు అయ్యాయి.

నాణేనికి మరోవైపు
డిడిఎస్ సంస్థ ప్రారంభం అయ్యాక 30-35 ఏండ్ల పాటు నిరాటంకంగా, సక్రమంగా కొనసాగినప్పటికీ, నాలుగైదు ఏండ్ల (2019–/-20) నుంచి సంస్థ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం ప్రారంభం అయింది. ఇక 2, 3 ఏండ్ల నుంచి అయితే కార్యాకలాపాలు పాక్షికంగానే కొనసాగుతున్నాయి. ఏ ఉద్దేశంతో అయితే డిడిఎస్‌ను స్థాపించారో, ఆ లక్ష్యాల నుంచి సంస్థ పక్కకు జరిగింది. మరోవైపు సాంప్రదాయ పంటలు, చిరు ధాన్యాల (మిల్లెట్స్) సాగు కంటే అధిక లాభాలను ఇచ్చే పత్తి, ఇతర వాణిజ్య పంటల పట్ల మహిళా సంఘాలు ఆసక్తికనబరిచాయి. దీంతో ఈ సంఘాలను డిడిఎస్ గాలికి వదిలేసింది.

అప్పటికే ఒక్కో సంఘానికి సుమారు 70 గ్రామాలలో 5-6 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి, అనేక చోట్ల బాల్వాడీ కేంద్రాలకు స్థలాలు ఉన్నాయి. ఐదు, ఆరు ఏండ్లుగా డిడిఎస్ కార్యాకలాపాలు మందగించడంతో భూములు పడావు పడ్డాయి. బాల్వాడీ కే ంద్రాలు మూతపడి ముళ్ల కంచెలు మెలిచాయి. దీనికి తోడు సంస్థను అన్నీ తానై నడపించిన డిడిఎస్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించిన పివి సతీశ్ అనారోగ్యకారణంగా గత ఏడాది మార్చిలో మరణించారు. అసలు విషయం ఏమిటంటే మహిళా పొదుపు సంఘాల పేరుపై ఉన్న సుమారు 83 ఎకరాలను సతీష్ బతికి ఉన్న రోజులల్లోనే ఇతరులకు అమ్మారనే విషయం ఆయన చనిపోయిన తర్వాత వెలుగులోకి రావడంతో తమను మోసం చేసిన డిడిఎస్ పై చర్య తీసుకోవాలని ఆరు నెలలుగా సంఘ సభ్యులు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు.

డైరెక్టర్ మరణం తర్వాత వెలుగులోకి…
డిడిఎస్ డైరెక్టర్ సతీశ్ మరణించినప్పడు ఇండియా మిల్లెట్స్ మెన్‌గా ఆయన్ను దేశ, విదేశీ మీడియా కొనియాడింది. డిడిఎస్ తమను ఆర్థికంగా,సామాజికంగా అభ్యున్నతి వైపు నడిపించడంలో సతీశ్ చేసిన కృషి ఎనలేనిదని మహిళా సంఘాల సభ్యులు అప్పట్లో ముక్తకంఠంగా కొనియాడారు. ‘మాకు ఆయన దేవుడు’ అని కన్నీళ్లు కార్చారు. కానీ అసలు సంగతి సతీశ్ మరణం తర్వాత డిడిఎస్ చేసిన మోసం ఒక్కోక్కటి బయటపడుతుండటంతో అప్పడు దేవుడు అని కొనియాడిన నోళ్లే, ప్రస్తుతం తమను నిట్టనిలువునా ముంచిన మోసగాడని తిడుతున్నారు. వీరి ధర్మానుగ్రహం లోనూ న్యాయం లేకపోలేదు. తాము కూలి…నాలి చేసి పైసా…పైసా కూడబెట్టి జమ చేసిన డబ్బులకు సాక్ష్యం ఎక్కడుందని డిడిఎస్ ప్రశ్నిస్తోందని వాపోతున్నారు.

వారి డబ్బులే కాకుండా సంఘాల పేరు పై కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి ఖరీదులో సంఘ సభ్యులు పావు భాగం చెల్లించగా, మిగతా ముప్పావు భాగాన్ని డిడిఎస్ భరించింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంఘాలకు వచ్చిన రివాల్వింగ్ ఫండ్, వచ్చిన విరాళాల నుంచి చెల్లించిందే. కానీ డిడిఎస్ పెట్టిన డబ్బు సభ్యులకు సంబంధించింది కాదని, అది డిడిఎస్ సొంత డబ్బు అని వాదిస్తోంది. కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తదితర పత్రాలను డిడిఎస్ పై నమ్మకంతో పెడితే, సదరు భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే తీసుకరండని డిడిఎస్ బుకాయిస్తుండటంతో మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అప్పుడేమో కొనుగోలు చేసిన భూమి మీదేనని నమ్మించి ఇప్పుడేమో అవీ తమవే అని డిడిఎస్ బుకాయిస్తుండటంతో సంఘ సభ్యులు దుమ్మెతి పోస్తున్నారు. నలబై ఏండ్ల కిందట ఊరూరా డిడిఎస్ ‘మహిళా పరస్పర సహాయక పొదుపు సంఘాల’ను ఏర్పాటు చేసినప్పుడు వాటిలో 25 నుంచి 35 మంది వరకు సభ్యులుగా చేరారు.

ఈ సంఘాల పేరున బ్యాంక్ ఖాతాలు తెరవడంతో వారం వారం ఒక్కో మహిళ సభ్యురాలు రుపాయి, రెండు, ఐదు, పది రూపాయాల చొప్పున వాటిలో జమ చేస్తూ పోయారు. ఇలా జమ చేసిన మొత్తం చివరకు ఒక్కో మహిళ సభ్యురాలి ఖాతాలో రూ.6 వేల నుంచి 7 వేల దాకా జమ అయింది. అలా ఒక సంఘంలో 30 మంది సభ్యులు ఉంటే వారిలో ఒక్కో సభ్యురాలు పొదుపు చేసిన సగటు మొత్తం రూ.6 వేలుగా తీసుకుంటే, అది 30 మందికి కలిపి రూ. లక్షా 80 వేలు. ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా మార్చి 10 నుంచి 12 ఏండ్లు బ్యాంకుల్లో పెట్టడంతో అది ఒక్కో సంఘానికి రూ. 7 నుంచి 8 లక్షల దాకా పెరిగి ఉంటుందన్నది అనధికారిక లెక్క. ఇలా అన్ని సంఘాలకు కలిపి బ్యాంక్‌లలో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ. 4-5 కోట్లు ఉండి ఉంటుందనేది అంచన.

మోసపూరితంగా స్థిర, చరాస్తుల బదలాయింపు
డిడిఎస్ ఏర్పాటు చేసిన మహిళా పరస్పర సహకార సహాయక పొదుపు సంఘాల బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన బాండ్ పేపర్లను సంస్థ తన వద్దనే పెట్టుకుంది. చివరకు పొదుపు ఖాతాలకు సంబంధించిన పాస్ బుక్కులను కూడా సంస్థ తన వద్దనే పెట్టుకుంది. డిడిఎస్ కార్యాకలాపాలు నిలిచిపోయి మూడు, నాలుగేండ్లు అవుతుండటంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లను రద్దు చేసుకొని తమ డబ్బులను వాపస్ తీసుకుందామని బ్యాంక్‌కు వెళితే, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమున్నాయని బ్యాంక్ అధికారులు అడుగుతున్నారని సభ్యులు వాపోతున్నారు. పోని తమ ఎఫ్‌డిలకు సంబంధించిన బాండ్ పేపర్లు ఇవ్వమని డిడిఎస్‌కు వెళ్లి అడిగితే తమ వద్ద ఏ పేపర్లు లేవని కనీసం ఆఫీసులోకి కూడా రానీయడం లేదని న్యాలకల్ మండలం మామిడ్గి గ్రామానికి చెందిన ముంగి బాలమణి వాపోయారు. తమ సంఘంలోని 32 మంది సభ్యులు పొదుపు చేసిన రూ. 2లక్షలు బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్టు తెలిపారు.

తమను బ్యాంక్‌కు తీసుకెళ్లి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించిన డిడిఎస్సే బాండ్ పేపర్లను తీసుకెళ్లడంతో తమ వద్ద ఏ ఆధారం లేకుండా పోయిందని వివరించారు. తామంతా నిరక్షరాస్యులం కావడంతో అప్పుడేమో కాగితాలు, రికార్డులు తమ వద్ద అయితేనే భద్రంగా ఉంటాయని చెప్పి నమ్మించి ఇప్పడేమో అవేవి తమ వద్ద లేవని డిడిఎస్ బుకాయిస్తుందని వాపోతున్నారు. బ్యాంక్ వారేమో ఆధారాలు ఉంటే తీసుకరండని అని అడుగుతున్నారని ఇదే సంఘానికి చెందిన చర్ల బసమ్మ వాపోయారు. సభ్యులు పొదుపు చేసిన డబ్బులను కూడా డిడిఎస్ తన పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవడంతో సభ్యులకు వారి డబ్బులను డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయిందని డిడిఎస్‌లో పని చేసిన ఉద్యోగి ఒకరు తెలిపారు. సభ్యులు డిడిఎస్‌ను గుడ్డిగా నమ్మి మోసపోయారని వివరించారు. సంఘ సభ్యులు పొదుపు చేసిన డబ్బులు మాత్రమే కాకుండా ఎస్సీ కార్పొరేషన్, డ్వాక్రా నుంచి తమ సంఘానికి వచ్చిన రివాల్సింగ్ ఫండ్‌ను కూడా డిడిఎస్ తన ఖాతాలో వేసుకుందని బసమ్మ, బాలమణి ఆరోపించారు. తాము అడగకముందే మీ డబ్బులు బ్యాంక్‌ల్లో భద్రంగా ఉన్నాయని డిడిఎస్ డైరెక్టర్ సతీశ్ తరుచూ చెప్పేవారని, ఆయన చనిపోయిన తర్వాతేమో మీ దగ్గర ఏ ఆధారం ఉందో తీసుకరండని అటు డిడిఎస్, ఇటు బ్యాంకర్లు అడుగుతున్నారని వాపోయారు.

దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డిడిఎస్) అంటే తెలియనివారు ఉండరు. ఐక్యరాజ్యసమతి ప్రశంసలు మొదలుకొని యునెస్కో వంటి అనేక అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశ, విదేశీ సంస్థల నుంచి నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్స్, రివాల్వింగ్ ఫండే అందేది. దాదాపు నాలుగు దశాబ్దాల డిడిఎస్ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. అణగారిన మహిళల సాధికారత గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచించకముందే డిడిఎస్ ఆ దిశగా పునాదులు వేసింది. మహాన్నత ఆశయాలతో నెలకొల్పిన డిడిఎస్ చరిత్ర ఇప్పుడు మసకబారింది. సంస్థలో నిధుల దుర్వినియోగం జరుగుతుందన్న సమాచారం బయటికి పొక్కడంతో ఫండింగ్‌ను నిలిపివేశాయి.

మహిళా సాధికారత గురించి ప్రభుత్వాలు ఆలోచించకముందే డిడిఎస్ ఆలోచించిందని వేనోళ్ల పొగిడిన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ఇప్పుడు అది తమను నమ్మించి నట్టేటా ముంచిందని తెగతిడుతున్నారు. కూలీనాలి చేసి పైసా పైసా కూడబెట్టి సంస్థలో దాచుకున్న డబ్బులను తెగమింగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొదుపు సంఘాలకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను తమకు తెలియకుండానే డిడిఎస్ తన ఖాతాలో వేసుకుందని లబోదిబోమంటున్నారు. తమ సంఘ సభ్యుల వాటాతో కొనుగోలు చేసిన సుమారు 83 ఎకరాలను మోసపూరితంగా డిడిఎస్ తన పేరుపై మార్చుకొని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుందని వాపోతున్నారు.

నిమ్జ్ భూసేకరణలో తమ సంఘాలకు చెందిన భూమి కోల్పోగా వచ్చిన నష్టపరిహారాన్ని కూడా డిడిఎస్సే దిగమింగిందని శాపనార్థాలు పెడుతున్నారు. మహిళా సంఘాల అభ్యున్నతి కోసం దాతలు ఇచ్చిన విరాళాల నుంచి రూ. 2 కోట్లమేరకు సంస్థ డైరెక్టర్ దివంగత సతీష్ వైద్య చికిత్స కోసం ఖర్చు చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు. పైన పటారం లోన లొటారంగా మారిన డిడిఎస్ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. మంత్రి, కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకునే నాధుడేలేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News