కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్షీణిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. జనవరి -మార్చి త్రైమాసికంలో ఇప్పటి వరకు నమోదైన లావాదేవీల ఆధారంగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్’ నివేదికపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ఐటీ పార్కులను ప్లాన్ చేయడానికి ముందు తొలి త్రైమాసికంలో హైదరాబాద్లో ఆఫీస్ లీజింగ్లో 41 శాతం క్లీణతను పరిష్కరించాలని సూచించారు. ఈ తిరోగమణం దేశవ్యాప్తంగా జరుగుతున్నదని కాదని పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ -ఎన్సిఆర్, ముంబయి,
పూణే వంటి నగరాలు గణనీయమైన వృద్ధిని సాధిస్తుంటే హైదరాబాద్ మాత్రం తిరోగమనంలో ఉందని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండేది అని, ఇప్పుడు క్షీణించడంపై ప్రభుత్వం తన పనితీరు పట్ల ఆత్మపరిశీలన చేసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ విధానాలను పునః పరిశీలన చేసుకోవాలని ఈ విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. విధ్వంసం విధ్వంసాన్నే సృష్టిస్తుందని, బుల్డోజర్లు ఉద్యోగాలు తీసుకురాలేవు అని, ఆ పనిని ప్రభుత్వ పాలసీలు చేస్తాయని తెలిపారు. కోలుకోలేని నష్టం రాకముందే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలని కోరారు.