Saturday, October 26, 2024

అది లక్ష్మీ బాంబో..తుస్సు బాంబో

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలోనే బాంబులు పేలుతాయన్నారని, ఆ బాంబులు ఆయన అక్రమ దందాల గురించో లేక సిఎం రేవంత్‌రెడ్డి బావమరిది తీసుకున్న రూ.1137 కోట్ల కాంట్రాక్ట్ అవినీతి గురించో కావొచ్చునని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం సిరిసిల్లలో తెలంగాణ విద్యుత్ ని యంత్రణ మండలి ఛైర్మన్ టి శ్రీరంగారావు అధ్యక్షతన జరిగిన స మావేశంలో, ఆ తరువాత మీడియాతో ఆయన మాట్లాడుతూ..శ్రీనివాస్‌రెడ్డి చెబుతున్న బాంబులు లక్ష్మీబాంబు లో, సుతిలి బాం బులో, తుస్సు బాంబులో తేలిపోతుందని ఎద్దే వా చేశారు. కొత్త బిచ్చగాడు రేవంత్‌రెడ్డి అని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డితోనే తాము పో ట్లాడామని, చిట్టినాయుడో లెక్కనా అని అ న్నారు.

చేతకాని వెధవలకు భయపడమని,దమ్ముంటే ముందు 100 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చిన 6 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసులకు తాము భయపడమని, చావుకు తెగించి తెలంగాణ తెచ్చినోళ్లమని, ఒరిజినల్ బాంబులకే భయపడలేదని, తుస్సు బాంబులకు భయపడతామా.. ఏం పీక్కుంటారో పీక్కోండి సవాల్ విసిరారు. అన్నారు. అడ్డమైన కేసులు పెట్టి జైలుకు పంపితే ప్రజల కోసం పోతామన్నారు. 100 శాతం రియల్ ఎస్టేట్ దందాలు సాగించే వారిపై, ఆర్‌ఆర్ ట్యాక్సులు వసూలు చేసేవారిపై ఇంతకు వంద రెట్లు వడ్డీతో సహా తేల్చుకుంటామన్నారు.

మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్‌లో దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, మేఘా కంపెనీ రూ.4500 కోట్ల అవినీతిని తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలికి తీస్తామన్నారు. జగిత్యాల ఎంఎల్‌ఏ సంజయ్ కుమార్ తాను పార్టీ మారలేదని అంటున్నారని, రేవంత్‌రెడ్డితో కండువా కప్పించుకోలేదా అన్నారు. ఇలాంటి వారిని రాజకీయ వ్యభిచారులని అంటారని వ్యాఖ్యానించారు. జగిత్యాల ఎంఎల్‌ఏతో సహా తమ పార్టీ మారిన 10 మంది ఎంఎల్‌ఏలు రాజకీయ వ్యభిచారులే అన్నారు. ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి స్థానిక ఎంఎల్‌ఏ పార్టీ మారాడంటే.. మంత్రి శ్రీధర్ బాబు పార్టీ మారలేదంటున్నారని అన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపమన్నారని, ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు స్పందించినా స్పీకర్ స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలను వారే హత్య చేసుకుంటున్నారని, పోలీసుల కుటుంబాలపై పోలీసులు దాడులు చేస్తున్నారని అన్నారు. సిరిసిల్లలో బతుకు తెరువు, ఉపాధి కోసం అల్లాడుతున్న వస్త్ర పరిశ్రమలోని ఆసామికి, దేశంలో అత్యంత కోటీశ్వరుడైన అదానీకి విద్యుత్ చార్జీల్లో తేడా లేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

విద్యుత్‌తో మానవాళికి విడదీయలేని అనుబంధం ఏర్పడిందన్నారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు విద్యుత్‌తో నిర్వహించినా ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా విద్యుత్ సరఫరా చేశామని అన్నారు. పది నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలపై రూ. 18,500 కోట్లు విద్యుత్ చార్జీల భారం పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. బిఆర్‌ఎస్ పదేళ్లలో నెలకు 1000 కోట్ల రూపాయలు విద్యుత్ చార్జీలు ప్రభుత్వం భరించి ఏటా 1200 కోట్ల విద్యుత్ చార్జీలను ప్రభుత్వం భరించిందన్నారు.24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందించామన్నారు. విద్యుత్ చార్జీలు పెంచే ప్రతిపాదనలు బిఆర్‌ఎస్ తిరస్కరిస్తోందన్నారు.అశాస్త్రీయంగా, అసంబద్దంగా ప్రతిపాదనలు పెట్టి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు.విద్యుత్ చార్జీలు అసంబద్దంగా పెంచడం తలతిక్క నిర్ణయమన్నారు. కాంగ్రెస్ పాలనలో కొత్త పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు దెబ్బతింటున్నాయన్నారు. విద్యుత్ అంటే వ్యాపారం కాదని, ప్రగతి పురోగతి సాధించేదన్నారు. కరెంట్ సమస్యతో మలిదశ ఉద్యమం ప్రారంభమైందన్నారు. చిన్న, మధ్య, కుటీర, సూక్ష్మ పరిశ్రమలను కాపాడుకుంటేనే వాటిపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధి పొందుతారని అన్నారు.

రానున్న వేసవిలో దాదాపు 70 నుండి 80 శాతం మంది వినియోగదారులు 300 యూనిట్ల పైన విద్యుత్ వినియోగిస్తారని అన్నారు. ఇది అందరిపై పడే భారమన్నారు. సిరిసిల్లలోని చిన్న ఆసామికి, బడా వ్యాపారి అదానీకి ఒకే రేట్ వర్తింపచేయడాన్ని తాను అధికారులను ప్రశ్నిస్తే గుజరాత్ రాష్ట్రంలో అమలవుతున్న విధానాన్ని అనుసరిస్తున్నామని సమాధానమిచ్చారని మండిపడ్డారు. గుజరాత్‌లో గడ్డి తింటే మనమూ గడ్డి తింటామా అని తాను ప్రశ్నించినట్లు కెటిఆర్ వివరించారు. ప్రభుత్వం చార్జీలు పెంచితే అడ్డుకుంటామన్నారు. ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. కరెంట్ కోతలు, చార్జీల మోతలు కాంగ్రెస్ పాలనలో ఉన్నాయన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసం ప్రయత్నిస్తే కాంగ్రెస్ పది నెలల పాలనలో సిరిసిల్ల పట్టణంలో ఇప్పటికే 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని, రాష్ట్రంలో మరో 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో కాకుండా ప్రధాని మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సి ఎల్ రమణ, మాజీ ఎంఎల్‌ఏ సుంకె రవిశంకర్, నాఫ్‌కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News