Saturday, September 14, 2024

ఉద్యాన పంటలకు భారీగా ప్రోత్సాహకాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపుదలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉ న్న పం డ్లను ఉత్పత్తి చేయటం ద్వారా రైతులకు ఆశించిన రీతిలో లాభాలు సాధ్యపడేవిధంగా పండ్ల తోటలను ఎంపిక చేస్తోంది. ఈ రకం తోటల పెంపకం కోసం పంటల సాగులో రైతులకు చేయూతగా పలు ప్రోత్సహాకాలు అందించనుం ది.రాష్ట్రంలోని ఉద్యాన పంటల విస్తీర్ణంలో ప్రత్యేకించి పండ్ల తోటల సాగు తక్కువగా ఉండడంతో మామిడి తప్ప అరటి మొదలకుకుని మిగతా అన్ని రకాల పండ్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో మార్కెట్లో అన్ని రకాల పండ్ల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పండ్ల తోటల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

పండ్ల తోటల సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు ప్రోత్సహం కల్పించేందుకు సన్నహాలు చేస్తోంది. అయితే, పండ్ల సాగు కోసం అర్హులైన రైతులు ఎంపిక , ఏఏ రకాల పండ్లతోటల సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలి, ఈ పథకం ఎప్పటి నుంచి అమలులోకి తేవాలి అన్నదానిపై ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తోంది.వ్యవసాయరంగంలో ఇతర ఆహార , వాణిజ్య పంటల సాగుతో పోలిస్తే రైతులకు పండ్ల తోటల సాగు ఎంతో కొంత లాభాసాటిగా ఉంటోంది. అదే విధంగా వీటికి మార్కెట్లో కూడా ఏడాది పొడవున డిమాండ్ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (నరేగా) అనుసంధానం చేసి వివిధ రకాల పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ ప్రణాళికను అమలు చేయటం ద్వారా రాష్ట్రంలో ప్రతి మండలానికి 50 ఎకరాల్లో పండ్లతోటల సాగును ప్రోత్సహించాలని లక్ష్యాలు రూపొందించుకుంటోంది.

సన్నచిన్నకారు రైతులకు ప్రోత్సాహం:
రాష్ట్రంలో సన్న చిన్నకారు రైతులకు పండ్లతోటల సాగువైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టబోతోంది. పండ్ల తోటల సాగులో భాగంగా రాష్ట్రంలో ఐదెకరాలలోపు సాగుభూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు రాయితీ కల్పించి పండ్లతోటలను ప్రోత్సహించాలని ఆలోచిస్తున్నారు. అలాగే రైతులకు ఉపాధి జాబ్ కార్డు కూడా ఉండాలి. వ్యవసాయ, ఉద్యాన (హార్టికల్చర్), నరేగా శాఖ సమన్వయంతో రైతులను ఎంపిక చేయనున్నారు.

16రకాల పండ్ల తోటలకు ప్రాధాన్యం :
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉద్యాన తోటల సాగుకు అనువైన నేలలు ,వాతావరణ పరిస్థితులను బట్టి 16రకాల పండ్లతోటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రతి మండలానికి 50 ఎకరాల విస్తీర్ణంలో పండ్లతోటల సాగును ప్రోత్సహించాలను అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా డిమాండ్ ఉన్న పండ్ల రకాలకు సబంధించిన తోటల సాగుకు సబ్సిడీ అందిస్తారు. డ్రాగన్ ఫ్రూట్, బత్తాయి, సపోట, ఆపిల్ బేర్, నిమ్మ, జామ, జీడిమామిడి, దానిమ్మ, మామిడి, పంటలతో పాటు పొలం గట్లపై వేసుకునే కొబ్బరి తోటలు, కరోంద (వాక్కాయ), చింత చెట్లు, మునగ, నేరేడు వంటి 16 రకాల పండ్ల తోటలకు సబ్సిడీ అందించనున్నారు.

తోటల పెంపకంలో మూడేళ్లవరకూ నిర్వహణ సాయం:
పండ్ల తోటల సాగుకు ఎంపికైన రైతులకు తోటల పెంపకానికి సంబంధించి మూడేళ్ల వరకు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే చెల్లించనుంది. అయితే రైతు పోలం లోని సారాన్ని బట్టి ఏ పండ్ల తోటలను సాగు చేయాలన్నది ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించి నిర్ణయిస్తారు. మొక్కలు నాటడానికి గుంతలు తీసే కూలీల ఖర్చు, తోట చుట్టూ కంచె ఏర్పాటు, ఎరువుల కొనుగోలు వంటి ఖర్చులను రైతులకు చెల్లించనున్నారు. తోటలో నీటితడులకు సబంధించి డ్రిప్ ఇరిగేషన్‌పై కూడా రాయితీ కల్పిస్తారు. పంట మొదటి దిగుబడి వచ్చే వరకు రైతులకు సాయం అందనుంది. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, మిగిలిన వారికి 90 శాతం మేర సబ్సిడీపై మైక్రో ఇరిగేషన్‌కు సంబంధించిన డ్రిప్ పరికరాలను పంపిణీ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News