Tuesday, September 24, 2024

పార్టీలు వేరైనా మాది ఒకే కుటుంబం: శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

ముంబై: కుటుంబపరంగా తాను, తన అన్న కుమారుడు అజిత్ పవార్ ఒకటేనని, కాని ఆయన వేరే రాజకీయ పార్టీకి సారథ్యం వహిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి, ఎన్‌సిపి(ఎస్‌పి వర్గం) అధ్యక్షుడు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. కోస్తా కొంకణ్ ప్రాంతంలోని చిప్లున్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కనీసం కుటుంబంగా తామిద్దరం ఒకటిగానే ఉన్నామని చెప్పారు. మళ్లీ వారిద్దరూ ఒకటి కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న డిమాండ్లను విలేకరులు ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గే ఏడాది జులైలో తన బాబాయ్ నుంచి వేరుపడి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన అధికార కూటమిలో కొనసాగడంపై ఊహాగానాలు సాగుతున్నాయి.

2024 లోక్‌సభ ఎన్నికలలో బారామతి నియోజకవర్గంలో తన సోదరి సుప్రియా సూలెపై తన భార్య సునేత్ర పవాత్‌ను నిలిపి తప్పు చేశానంటూ అజిత్ పవార్ ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ఇప్పుడు ఆయన(అజిత్ పవార్) వేరే పార్టీలో ఉన్నారని, వేరే పార్టీ తీసుకున్న నిర్ణయాలపై తానేమి మాట్లాడగలనని శరద్ పవార్ అన్నారు. కాంగ్రెస్, శివసేన(యుబిటి), ఎన్‌సిపి(ఎస్‌పి)తో కూడిన ఎంవిఎ కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించిందా అన్న ప్రశ్నకు ఇప్పుడు అది అంత అత్యవసరమైన అంశం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ కాలంలో ఎన్నికలు జరిగినపుడు ప్రధాని అభ్యర్థిగా మొరార్జీ దేశాయ్ పేరును పోలింగ్‌కు ముందు ప్రకటించలేదని ఆయన గుర్తు చేశారు.

సమాజ్‌వాది పార్టీ, పీసెంట్స్ అండ్ వెల్ఫేర్ పార్టీ వంటి ఇతర పార్టీలతో కలసి మహారాష్ట్రలో ప్రగతిశీల ప్రత్యాప్రాయ్నాన్ని ఇవ్వాలన్నదే తమ ఎంవిఎ కూటమి ప్రయత్నమని ఆయన తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తమ కూటమికి అధికారాన్ని ఇవ్వాలని ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో తిరుమల ఆలయంలో లడ్డూ ప్రసాదాల తయారీలో నాసిరకం నెయ్యిని ఉపయోగించారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన గురించి ప్రశ్నించగా ఏదైనా తప్పు జరిగి ఉంటే దాంతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందేనని శరద్ పవార్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News