జిహెచ్ఎంసి పరిధిలో పేదలకు తొలివిడతగా 1152 ఇళ్లను పంపిణీ చేయనున్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇళ్లులేని నిరుపేదలకు అసలైన దసరా పండుగా రానే వచ్చింది. ఎన్నోయేళ్ళ నుంచి కళలు కంటున్న సొంతింటి కళ మరో 24 గంటల్లో నెరవేరబోతోంది. సోమవారం రోజున గ్రేటర్ పరిధిలో సుమారు 1152 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. ఈ కార్యక్రమం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంతి కెటిఆర్ చేతుల మీదుగా పెద్దఎత్తున ఈ కార్యక్రమం ప్రారంభం కనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా డబుల్బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గ్రేటర్ పరిధిలో సుమారు రూ.9700 కోట్లతో లక్ష ఇళ్ల నిర్మాణాలను చేపడతోంది. అయితే దసరా నాటికి 85వేల ఇళ్లను లబ్దిదారులకు భావించినప్పటికీ కరోనా వ్యాధితో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పనుల్లో వేగం కొంత మేర మందగించింది.
అయినప్పటికీ మరో ఒకటి, రెండు నెలల్లో ఇళ్ల పంపిణి కార్యక్రమాన్ని పూర్తిగా ముగించాలని రాష్ట్ర భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇళ్ల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచింది. సంబంధిత అధికారులకు కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ల వెంట పడుతున్నారు. పనుల్లో వేగం పెంచుతున్నారు. దీంతో చాలా వరకు నిర్మాణాలు ముంగింపు దశకు చేరుకున్నాయి. చిన్న చిన్న పనులు మినహా ఇతర పనుల పూర్తి అయ్యాయి. దీంతో త్వరలోనే వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అయిన చోట్ల వాటిని లబ్ధిదారులకు పంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలో గ్రేటర్ లోని పేదలకు 1152 ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మొదటగా జియాగూడలో 840, కట్టేల మండిలో 120, గోడే కా కబర్ 192 ఇళ్ళను పంపిణి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గత రెండు రోజులుగా పరిశీలిస్తున్నారు.