ముంబై: భారత్కు ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను అందిస్తున్న ఘనత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్దే దక్కుతుందని టీమిండియా మాజీ మానసిక వైద్య నిపుణుడు పాడీ ఆప్టన్ అభిప్రాయపడ్డారు. భారత యువ జట్లకు ప్రధాన కోచ్గా ఉన్న ద్రవిడ్ ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను టీమిండియాకు అందించారన్నారు. యువ క్రికెటర్లు తప్పులు చేసినా ద్రవిడ్ ఆగ్రహం వ్యక్తం చేయడని, చాలా సున్నితంగా వారి తప్పులను గుర్తు చేస్తారన్నారు. అంతేగాక ఆ తప్పులను ఎలా సరిదిద్దు కోవాలో వారికి అర్థమయ్యే రీతిలో వివరిస్తాడన్నారు. అండర్19, భారత్ఎ జట్లకు ద్రవిడ్ ప్రధాన కోచ్గా ఉండడం టీమిండియాకు ఎంతో కలిసి వచ్చిందన్నారు. యువ క్రికెటర్లలోని ప్రతిభను గుర్తించి వారిని మరింత మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దిన ఘనత ద్రవిడ్కే దక్కుతుందన్నారు. ఇక సైని, సిరాజ్, సుందర్, నటరాజన్, గిల్, పృథ్వీషా, మయాంక్ వంటి యువ క్రికెటర్లను మెరికల్లాంటి ఆటగాళ్లుగా ద్రవిడ్ తీర్దిదిద్దాడని ప్రశంసించారు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్లో భారత్ చారిత్రక విజయం సాధించడంలో యువ క్రికెటర్లు కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఆప్టన్ గుర్తు చేశారు.