Wednesday, October 23, 2024

ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద డ్రోన్ సమ్మిట్

- Advertisement -
- Advertisement -

దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ యుడుతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి సీకె కన్వెన్షన్‌లో డ్రోన్ సమ్మిట్ నిర్వహించారు. డ్రోన్ సమ్మిట్‌లో 6929 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 53 స్టాల్స్‌లో డ్రోన్‌ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీలో భారత్ దూసుకుపోతోందన్నారు. అమెరికాలో ఉన్న కార్పొరేట్ సంస్ధలను కలిశానని, ఇండియా టెక్నాలజీలో స్ట్రాంగ్ గా ఉందని, ఇండియాలో మాత్రమే అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడే వారున్నాన్నారు. జీరో కనుగొన్నది ఇండియన్స్, ఇంగ్లీషు మాట్లాడే అధికులు ఇండియన్స్ అని బిల్ గేట్స్ కు చెప్పి ఒప్పించి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు తెచ్చానని గుర్తుచేసుకున్నారు. ఇలాంటి ఒక డ్రోన్ సమ్మిట్ చాలా మంచిది.

ఇది ఒక మార్పు తీసుకువస్తుందన్నారు. మనకు అడ్వానస్డ్ డ్రోన్స్, సీసీ కెమెరాలు, ఇతర ఐఓటీ పరికరాలు ఉన్నాయన్నారు. జాబ్ అడిగే వారు కావద్దు..జాబ్స్ ఇచ్చే వారిగా మారాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగు కమ్యూనిటీ నుంచే 30 శాతం మంది జాబ్స్ ఇచ్చే వారుగా ఉన్నారన్న ఆయన ఎమిరేట్స్ నుంచి మొదటి ఫ్లైట్ హైదరాబాద్‌కు తెచ్చామని, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కోసం అప్పటి ప్రధాని వాజ్ పేయిని ఒప్పించానని అన్నారు. ఇప్పుడు యుద్దాల్లో కూడా వాడే డ్రోన్లను అభివృద్ధి కోసం వినియోగించాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్ ఎకానమీని అభివృద్ధి చేయటమే ఆంధ్రప్రదేశ్ ముఖ్య లక్ష్యమని వెల్లడించారు. 20వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యమని వివరించారు. అమరావతిని దేశానికి డ్రోన్ నగరంగానూ, ఆంధ్రప్రదేశ్‌ను డ్రోన్ హబ్‌గా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు. అందరి ఆలోచనలతో 15 రోజుల్లో డ్రోన్ పాలసీ ప్రకటిస్తామన్నారు. కర్నూల్ సమీపంలోని ఓర్వకల్లు వద్ద 300 ఎకరాల భూమిని డ్రోన్ హబ్ కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు ఇది కేంద్రం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

కాగా అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. డ్రోన్ పైలట్ శిక్షణపై క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఒప్పందం చేసుకుంది. తిరుపతి ఐఐటీని నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా చేర్చుకుంటూ రెండో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్ మార్కెట్ విస్తరణకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తానే ఈ రంగాన్ని ప్రోత్సహించకుంటే ఇంకెవరూ ప్రోత్సహించలేరన్నారు. ఎక్కువ నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దని కేంద్ర పౌరవిమానయాన శాఖకు విజ్ఞప్తి చేశారు. యువత, డ్రోన్ తయారీ పరిశ్రమలు, కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేస్తూ అద్భుతాలు సృష్టిద్దామని పిలుపునిచ్చారు. వినూత్న ఆలోచనల దిశగా విద్యార్థులను మలచాలని విశ్వవిద్యాలయాలకు విజ్ఞప్తి చేశారు. సర్వీస్ ప్రొవైడర్‌కు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్ కానుందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే డ్రోన్ హబ్ గా మారాలి : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే డ్రోన్ హబ్ గా మారాలని ఆకాంక్షిస్తున్నా అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. డ్రోన్ల సమర్ధ వినియోగం ద్వారా అత్యవసర సేవలు అందించటం సరికొత్త విప్లవమని తెలిపారు. గత 10ఏళ్లలో కేంద్ర పౌర విమానయాన రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. 74 విమానాశ్రయాలను 157కి గత పదేళ్లలో పెంచామని, రానున్న రోజుల్లో 200పై చిలుకు విమానాశ్రయాల అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 132 డ్రోన్ పైలెట్ శిక్షణ కేంద్రాల ద్వారా ఎన్నో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని వెల్లడించారు. కొత్త తరం, కొత్త ఆలోచనలు,

కొత్త రకం డ్రోన్ల లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రస్తుతం 27 వేల డ్రోన్లు రిజిస్టరై ఉండగా, లక్ష డ్రోన్ల రిజిస్ట్రేషన్ లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అత్యుత్తమ డ్రోన్ పాలసీని అమలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవకాశాలను అందిపుచ్చుకోవటంలో ముందుందన్నారు. ఢిల్లీ కేంద్రంగా జరగాల్సిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ కారణంగానే అమరావతి కేంద్రంగా జరుగుతోందని తెలిపారు. ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దాలనే సీఎం లక్ష్య సాధనలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. 1995 లోనే 2020 లక్ష్యాలను నిర్ధేశించి భవిష్యత్ ప్రణాళికలు రచించిన దార్శనికుడు చంద్రబాబు అని తెలిపారు.

డ్రోన్ నిబంధనలు కేంద్రం సులభతరం : కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఉంలున్ మాన్గ్ ఉలనం

గతంతో పోల్చితే డ్రోన్ నిబంధనలను కేంద్రం సులభతరం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఉంలున్ మాన్గ్ ఉలనం తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా డ్రోన్ల తయారీ, వినియోగానికి కేంద్రం ఎంతో తోడ్పాటునిస్తోందన్నారు. డ్రోన్ రంగంలో అంకురాలు, యువతను మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. డ్రోన్ల సమర్ధ వినియోగానికి సలహాలు, సూచనలు కూడా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో అమరావతి డ్రోన్ కేపిటల్ గా నిలుస్తుందని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఈజ్ ఆఫ్ లివింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ ప్రభుత్వం నినాదమని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ స్పష్టంచేశారు. పెరుగుతున్న డ్రోన్ల వినియోగాన్ని

వివిధ రంగాల్లో అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నానన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి వేగంగా అభివృద్ధి చెందే ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోందని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం బెరంపార్క్‌లో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో నిర్వహించారు. 5500 డ్రోన్లతో ప్రదర్శన, లేజర్ షో చేపట్టారు. వీటిని తిలకించేందుకు విజయవాడలో ఐదు ప్రదేశాలలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News