Tuesday, April 1, 2025

మయన్మార్ లో భూవిలయంలో 1600 మృతులు

- Advertisement -
- Advertisement -

కూలిన భవనాల శిథిలాల్లో నుంచి
మరిన్ని మృతదేహాల వెలికితీత
3408 మంది గాయపడినట్లు
సైనిక ప్రభుత్వం వెల్లడి
ఇంకా జాడ తెలియని 30 మంది

బ్యాంకాక్: మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తిమంతమైన భూకంపంలో మృతుల సంఖ్య శనివారం వెయ్యి దాటింది. దేశంలోని రెండవ పెద్ద నగరం మాండలే సమీపంలో భూకంపం సంభవించినప్పుడు కుప్పకూలిన పెక్కు భవనాల శిథిలాల్లో నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. 1600 మంది మృతి చెందారని, మరి 3408 మంది గాయపడ్డారని, మరి 30 మంది వ్యక్తుల జాడ ఇంకా తెలియరాలేదని దేశంలోని మిలిటరీ సారథ్యంలోని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని, ‘సమగ్ర వివరాలను ఇప్పటికీ సేకరిస్తున్నాం’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. ఒకప్పుడు బర్మా అయిన మయన్మార్‌లో సుదీర్ఘ కాలంగా, రక్తపాతంతో కూడిన అంతర్యుద్ధం సాగుతోంది.

ఆ యుద్ధం ఇప్పటికే భారీ ఎత్తున మానవతావాద సంక్షోభానికి దారి తీసింది. దేశవ్యాప్తంగా ప్రయాణం సంక్లిష్టంగా, ప్రమాదకరంగా మారుతోంది. దీనితో సహాయ కార్యక్రమాల నిర్వహణ కష్టంగా ఉన్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. భూకంపం శుక్రవారం మధ్యాహ్నం సంభవించింది. భూకంపం ప్రధాన కేంద్రం మాండలేకు దూరంలో లేదు. ఆతరువాత 6.4 తీవ్రతతో భూకంపంతో సహా పలు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో భవనాలు నేలమట్టం అయ్యాయి. రోడ్లు దెబ్బ తిన్నాయి. వంతెనలు కూలిపోయాయి. ఒక డ్యామ్ పేలిపోయింది. రాజధాని నేపిదాలో దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనుల్లో సిబ్బంది శనివారం నిమగ్నమయ్యారు. నగరంలో అధిక భాగంలో విద్యుత్, ఫోన్, ఇంటర్నెట్ సర్వీసులు ఇంకా పునరుద్ధరణ కాలేదు. భూకంపం అనేక భవనాలను నేలమట్టం చేసింది. వాటిలో ప్రభుత్వ ఉద్యోగుల నివసిస్తున్న పలు ఇళ్లు కూడా ఉన్నాయి. అయితే, నగరంలో ఒక సెక్షన్‌ను అధికారులు శనివారం ఇతరులకు అందుబాటులో లేకుండా చేశారు.

థాయిలాండ్‌లో మరింత నష్టం

పొరుగున ఉన్న థాయిలాండ్‌లో భూకంపం సుమారు కోటి 70 లక్షల జనాభా గల గ్రేటర్ బ్యాంకాక్ ప్రాంతాన్ని, దేశంలోని ఇతర ప్రాంతాలను కుదిపివేసింది. ఇంత వరకు ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయని, 26 మంది గాయపడ్డారని, 47 మంది జాడ ఇంకా తెలియరాలేదని, వారిలో చాలా మంది రాజధానిలోని పాపులర్ చతుచాక్ మార్కెట్ సమీపంలోని ఒక నిర్మాణ ప్రదేశం నుంచి గల్లంతయ్యారని బ్యాంకాక్ నగర అధికారులు వెల్లడించారు. టన్నుల కొద్దీ శిథిలాల తరలింపు కోసం శనివారం మరిన్ని భారీ యంత్రాలను తీసుకువచ్చారు. అయితే జాడ తెలియకుండాపోయినవారిపై కుటుంబ సభ్యులు, మిత్రుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ‘వారు బతికి బయటపడాలని ప్రార్థిస్తున్నాను.

కానీ నేను ఇక్కడికి వచ్చి. శిథిలాల కుప్పలు చూసినప్పుడు వారు ఎలా ఉండవచ్చు? ఏ మూల ఉన్నారు? వారు ఇంకా సజీవంగా ఉన్నారా? అని అనిపిస్తోంది. మొత్తం ఆరుగురూ సజీవంగా ఉండాలని ఇప్పటికీ ప్రార్థిస్తున్నాను’ అని 45 ఏళ్ల నరుమో తోంగ్లెక్ విలపిస్తూ చెప్పింది. మయన్మార్‌కు చెందిన తన భాగస్వామి, ఆ ప్రదేశంలో పని చేసిన ఐదుగురు స్నేహితుల గురించిన వార్త కోసం ఆమె నిరీక్షిస్తోంది. భూకంపానికి దాదాపు ఒక గంట ముందు ఒక ఫోన్ కాల్ వచ్చినప్పటి నుంచి తన కుమార్తె కన్లయానీ నుంచి తాను ఏమీ వినలేదని వేన్‌ఫెట్ పాంటా తెలిపారు. కన్లయానీ శుక్రవారం ఆ భవనంపై ఎత్తులో పని చేస్తూ ఉందని ఆమెతో ఒక స్నేహితురాలు చెప్పింది. ‘నా కుమార్తె క్షేమంగా ఉండాలని, ఆమె బతికి బయటపడాలని,ఆమె ఆసుపత్రిలో ఉందని ప్రార్థిస్తున్నాను’ అని ఆమె తెలిపింది. కన్లయానీ తండ్రి ఆమె పక్కనే కూర్చుని ఉన్నారు. దేశంలోని చాలా ప్రావిన్స్‌లలో భూకంపం, తదనంతర ప్రకంపనల ప్రభావం కనిపించిందని థాయి అధికారులు తెలిపారు. ఉత్తరాన అనేక ప్రదేశాల్లో నివాస భవనాలు, ఆసుపత్రులు, చియాంగ్ మైతో సహా ఆలయాలు దెబ్బ తిన్నట్లు సమాచారం వచ్చింది. అయితే, మృతుల గురించిన సమాచారం బ్యాంకాక్ నుంచే వచ్చింది.

మయన్మార్‌కు వివిధ దేశాల బృందాలు

మయన్మార్ మిలిటరీకి ఆయుధాలు సరఫరా చేసిన అతిపెద్ద దేశాలు చైనా, రష్యా. ఆ రెండు దేశాలు మానవతావాద సహాయంతో ముందుకు వచ్చిన దేశాల్లో ముందు ఉన్నాయి. వైద్య కిట్లు, జనరేటర్లతో పాటు 135 మందికి పైగా రక్షక, సహాయక సిబ్బందిని, నిపుణులను తాను పంపినట్లు చైనా వెల్లడించింది. తాను 120 రక్షక, సహాయక సిబ్బందిని, సప్లయిలను పంపినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వశాఖ తెలియజేసింది.

భారత్ కూడా అన్వేషక, సహాయక బృందాన్ని, వైద్య బృందాన్ని పంపింది. తాము ఆదివారం 50 మందిని పంపుతామని మలేషియా తెలిపింది. కాగా, అంతర్జాతీయ సంస్థల ద్వారా తాను 2 మిలియన్ డాలర్లు విలువ చేస్తే మానవతావాద సహాయం అందజేస్తానని దక్షిణ కొరియా ప్రకటించగా, యుఎన్ సహాయ కార్యక్రమాలు ప్రారంభించేందుకు 5 మిలియన్ డాలర్లు కేటాయించింది. యుఎస్ సహాయం అందజేయబోతున్నదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. అయితే, విదేశాలకు సాయంలో ట్రంప్ ప్రభుత్వం బాగా కోతలు పెట్టిన దృష్టా ఆయన హామీ గురించి కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

మయన్మార్ మిలిటరీ ప్రభుత్వంతో ప్రధాని మోడీ సంభాషణ

భారత్ అండగా నిలుస్తుందని హామీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ శనివారం మయన్మార్ మిలిటరీ ప్రభుత్వాధినేత మిన్ ఆంగ్ హ్లాయింగ్‌తో మాట్లాడారు. మయన్మార్‌లో భారీ భూకంపం కలిగించిన విపత్తును అధిగమించడంలో ఆ దేశం పట్ల భారత్ సంఘీభావంతో ఉన్నదని తెలియజేశారు. ‘మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లాయింగ్‌తో మాట్లాడాను. బీ భత్సకర భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల మా ప్రగాఢ సంతాపం తెలియజేశాను. సన్నిహిత మిత్రదేశంగా, పొరుగు దేశంగా భారత్ ఈ సంక్లిష్ట సమయంలో మయన్మార్ ప్రజల పట్ల సంఘీభావం వ్య క్తం చేస్తోంది’ అని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ఆపరేషన్ బ్రహ్మ’ పథకంలో భాగంగా బాధిత ప్రాంతాలకు భారత్ విపత్తు సహాయ వస్తువులు, మానవతావాద సహాయం, అన్వేషక, సహాయ బృందాలను పంపుతోంది’ అని మోడీ తెలిపారు. ఆ పథకం కింద మయన్మార్‌కు 15 టన్నుల సహాయ వస్తువులను ఇప్పటికే పంపడమైంది.
భూకంప మృతుల్లో భారతీయులెవరూ లేరు: కేంద్రం
మయన్మార్ భూకంప విలయంలో ఇప్పటికే మృతుల సంఖ్య వెయ్యి దాటినట్టు మయన్మార్ ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారి సంఖ్య 2 వేలకు పైగా ఉన్నట్టు పేర్కొంది. అయితే ఇప్పటివరకు మృతుల్లో భారతీయులు ఎవరూ లేరని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మయన్మార్‌కు అత్యవసర సామగ్రి, సహాయక సిబ్బందిని పంపిస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News