Sunday, October 20, 2024

అంబర్‌పేటలో వృద్ధ దంపతుల హత్య

- Advertisement -
- Advertisement -

వృద్ధ దంపతుల తలపై మోదీ కిరాతకంగా హత్య చేసిన సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…..రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి లింగారెడ్డి(75), ఉర్మిళాదేవి దంపతులు సాయినగర్ కాలనీలో ఉంటున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉండా వారికి వివాహాలు కావడంతో విదేశాల్లో స్థిరపడ్డారు. లింగారెడ్డి 15ఏళ్ల క్రితం పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. దంపతులు ఇక్కడే మూడు అంతస్థుల భవనంలో కింది ఫ్లోర్‌లో ఉంటుండగా, మిగతా వాటిని అద్దెకు ఇచ్చారు. గురువారం ఉదయం కన్పించిన దంపతులు తర్వాత స్థానికులకు కన్పించలేదు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్లు బద్దలుకొట్టి చూడగా దంపతులు హత్యకు గురై ఉన్నారు. ఊర్మిళా దేవి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు లేకపోవడంతో చోరీకి వచ్చిన దొంగలు హత్య చేసి బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తెలిసిన వారిపనేనా….
ఊర్మిళా దేవి ఒంటిపై బంగారు ఆభరణాలు లేకపోవడం, ఇంట్లోని బిరువాలు తెరిచి ఉండడడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలిసిన వారే దంపతులను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. ముగ్గురు కుమార్తెలు వివాహాలు చేసుకుని అమెరికాలో ఉండడంతో వృద్దులైన భార్యాభర్తలు ఇద్దరు ఉంటున్నారు. వారిని చాలా రోజుల నుంచి గమనించిన వారు తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. హత్య సంఘటన స్థలాన్ని ఈస్ట్ జోన్ డీసీసీ డాక్టర్ బి.బాలస్వామి, అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్య, కాచిగూడ ఏసీపీ రఘు, అంబర్‌పేట డీఐ మల్లేశ్వరీ, ఎస్సైలు మౌనిక, విజయ్, తరుణ్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వారు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News