ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సీ రష్యాతో యుద్ధాన్ని నిరంతం కొనసాగేలా చేస్తున్నారని అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆదివారం మండిపడ్డారు. ఒకవేళ తాను ‘స్టార్ లింక్’ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తే, యుద్ధరంగంలో కీవ్ సేనలు ఓడిపోతాయని హెచ్చరించారు. ‘ఎక్స్’ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మస్క్ స్పందించారు. ‘శ్వేతసౌధం సమీపంలో భారీ ఉక్రెయిన్ జెండా ఆవిష్కరణకు నిధులు ఎవరు కేటాయించారు?’ అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు జవాబుగా,‘మొనాకోలో విలాస భవనాలు కలిగిన వారిపై, టాప్ 10 మంది ఉక్రెయిన్ సంపన్నులపై ఆంక్షలు విధించాలి. తద్వారా ఇలాంటి కార్యకలాపాలకు కట్టడి ఏర్పడుతుంది’ అన్నారు.
‘ఉక్రెయిన్నే ఎందుకు లక్షం చేసుకుంటున్నారు?’ అనే ట్వీట్కు మస్క్ స్పందిస్తూ ‘ఉక్రెయిన్ విషయంలో చర్చలకు రావాలంటూ నేను ఇదివరకే పుతిన్కు సవాలు విసిరాను. కాగా కీవ్ సైన్యానికి మా స్టార్లింక్ వ్యవస్థ దన్నుగా నిలుస్తోంది. ఒకవేళ దాని ఇంటర్నెట్ సేవలను వారికి నిలిపేస్తే ఉక్రెయిన్ ఓటమి ఖాయం. ఏళ్ల తరబడి సాగుతున్న ఊచకోత విసుగు పుట్టిస్తోంది. వాస్తవికతతో ఆలోచించేవారు, పరిస్థితిని అర్థం చేసుకునేవారు ఎవరైనా ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటారు’ అని మస్క్ పేర్కొన్నారు.