Thursday, September 19, 2024

ఎక్స్‌కు రూ.5 కోట్ల జరిమానా

- Advertisement -
- Advertisement -

ఐర్లాండ్‌లో ఇంత పెద్ద జరిమానా ఇదే మొదటిసారి
ఎక్స్‌కు షాక్ ఇచ్చిన ఐర్లాండ్ వర్క్‌ప్లేస్ కమిషన్ (డబ్ల్యుఆర్‌సి)
ఉద్యోగిని ఆకస్మికంగా తొలగించినందుకు రూ.5 కోట్ల జరిమానా
డబ్లిన్ : సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్‌కు ఐర్లాండ్ వర్క్‌ప్లేస్ కమిషన్ (డబ్లుఆర్‌సి) భారీ షాక్ ఇచ్చింది. తొలగించిన ఒక ఉద్యోగికి భారీగా జరిమానా చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఉద్యోగికి పరిహారంగా 602640 డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 5 కోట్లు) జరిమానా విధించి దానిని చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఇంత భారీ పరిహారాన్ని చెల్లించాలని తీర్పు ఇవ్వడం ఐర్లాండ్‌లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆ వివరాల్లోకి వస్తే, ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తరువాత అందులో అనేక మార్పులు చేర్పులు చేశారు. ఆ క్రమంలో ట్విట్టర్‌ను మెరుగుపరిచేందుకు ఉద్యోగులు అంకితభావం, సుదీర్ఘ పని గంటలకు కట్టుబడి ఉండాలని మస్క్ సూచించారు. ఇందుకుగాను ఇమెయిల్ చివర్లో అవును, కాదు అనే రెండు ఆప్షన్లు ఇచ్చి అభిప్రాయాలు తెలపాలని ఆయన కోరారు. దీనికి ఎటువంటి సమాధానమూ ఇవ్వకపోతే ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తామని షరతు విధించారు.

దీనిపై నిర్ణయం తీసుకునేందుకు మూడు నెలల సమయం కూడా ఇచ్చారు. అయితే, 2013 నుంచి డబ్లిన్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న గ్యారీ రూనీ ఇమెయిల్‌కు ఎటువంటి జవాబూ ఇవ్వలేదు. దీనితో కారణాలు తెలపుకుండానే అతనిని స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి తొలగించారు. దీనితో అతను డబ్ల్యుఆర్‌సిని ఆశ్రయించాడు. కమిషన్ దీనిపై విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. ఇమెయిల్‌లో అవును అని క్లిక్ చేయకపోవడాన్ని రాజీనామాగా పరిగణించలేమని న్యాయాధికారి మైఖేల్ మెక్‌నామీ పేర్కొన్నారు. రూనీ ఆకస్మిక తొలగింపుతో ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదుర్కొన్న ఇబ్బందులకు పరిహారంగా అతనికి రూ. 5 కోట్లు చెల్లించాలని తీర్పులో కమిషన్ సూచించింది. ఈ తీర్పుపై మస్క్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News