రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మనతెలంగాణ/హైదరాబాద్: భవిష్యత్లో సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వానికి పేరు తీసుకురావడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని, గతంలో నెల రోజుల పాటు శిక్షణ ఉండేదని, ఇప్పుడు నెలుగు నెలల పాటు ఈ శిక్షణ ఉంటుందని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఫీల్డ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా పని చేయడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని, రవాణా శాఖ గౌరవాన్ని కాపాడుతుందని ఆయన అన్నారు. ఉద్యోగం పొందినప్పుడు ఎలా ఉంటారో దానిని ఎప్పటికీ కంటిన్యూ చేయాలని ఆయన తెలిపారు.
రాజా బహుదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో కొత్తగా ఎంపికై నియమకపత్రాలు పొందిన ఏఎంవిఐ (అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్) శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, తెలంగాణ పోలీస్ అకాడమీ డెరైక్టర్ శ్రీనివాస్ రావు , డిప్యూటీ డెరైక్టర్ నర్మదాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ మీరు చేసే పని రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గించేలా పని చేయాలని, ఫిట్నెస్ ఉందా లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నామా లేదా అనే విధంగా పని చేయవద్దన్నారు.
నెల రోజుల్లో ‘వాహన్’ ప్రారంభం: కమిషనర్, సురేంద్ర మోహన్
రవాణా శాఖ కమిషనర్, సురేంద్ర మోహన్ మాట్లాడుతూ ఏఎంవిఐలకు ట్రైనింగ్ లో స్కిల్స్ డెవలప్మెంట్, క్రమశిక్షణ తదితర వాటిపై శిక్షణ ఇస్తామన్నారు. ట్రాన్స్ఫోర్ట్ డిపార్ట్మెంట్ 65 ఆన్లైన్ సేవలు అందిస్తుందన్నారు. ప్రభుత్వం శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసి పోర్టల్ ద్వారా సారథి డేటాను అప్లోడ్ చేశామని, 10 రోజుల్లో సికింద్రాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ప్రారంభించుకుంటామని ఆయన తెలిపారు.
నెల రోజుల్లో ‘వాహన్’ కూడా ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. ప్రమాదాల్లో మరణాలు తగ్గించడానికి రవాణా శాఖ అవగాహన కల్పిస్తుందన్నారు. 2024 లో 26 వేల ప్రమాదాలు తెలంగాణలో జరిగితే 7 వేల మంది మృత్యువాత పడ్డారని ఆయన తెలిపారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ రక్షణ కొరకు రవాణా శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ పెట్టడం జరిగిందని, ఈ వ్యవస్థ త్వరలోనే ప్రారంభం కానుందన్నారు.