Saturday, September 21, 2024

ఇంగ్లీష్ మీడియంకు వేళాయె

- Advertisement -
- Advertisement -

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాద్యమంలో తరగతులు: మంత్రి వర్గ ఉపసంఘం వెల్లడి

జూన్ 1- 12 వరకు బడిబాట
మౌలిక సదుపాయాల కల్పన పనులు
యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యేలా
చర్యలు సొంత నియోజకవర్గంలో
క్రీడా పరికరాల కొనుగోలుకు
పాఠశాలకు రూ.50వేలు విడుదల
చేసిన మంత్రి కెటిఆర్
‘మన ఊరు మన బడి’పై సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి వర్గ ఉప సంఘం తెలిపింది. జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి 12 వరకు బడిబాట కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను ఆ ధునికీకరించడంతో పాటు ఇంగ్లీష్ మీడి యం ప్రవేశపెడ్తున్న వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని తెలిపింది. శనివారం నాడు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మన ఊరు – మన బడి కార్యక్రమంపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరిగింది.

ఈ బేటీలో మంత్రులు కె.టి.రామారావు, టి.హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఇకపై విధిగా విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించింది. త్వరలోనే టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని దాదాపు 30వేల విద్యా సంస్థలన్నింటికీ బ్యాండ్విడ్త్ సౌకర్యాన్ని కల్పించబోతున్నామని, తద్వారా భవిష్యత్‌లో డిజిటల్ ఎడ్యుకేషన్ ను విద్యార్థులకు అందించడం సులభమవుతుందని మంత్రి వర్గ ఉపసంఘం పేర్కొంది. పాఠశాల స్థాయిలో కొత్తతరం పిల్లల్లో ఔత్సాహికవేత్తలను ప్రోత్సహించేందుకు వీలుగా కరిక్యులమ్ రూపొందించాలని అభిప్రాయబడింది.

మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం చేయాలి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. లక్ష్యాలకు అనుగుణంగా ఈ పనులను చేపట్టి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రతీ వారం వీడియో కాన్ఫెరెన్సును నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. మే మాసంలో ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా విద్యా సంస్థల్లో మొక్కలు నాటేందుకు, పచ్చదనాన్ని పెంచేందుకు రెండు, మూడు రోజులు కేటాయించాలని నిర్ణయించారు. ఆకర్షణీయమైన పాఠశాల భవనం, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చూడటంతో పాటు విద్యార్థులను పాఠశాల వైపు ఆకర్షితులను చేసేందుకు అవసరమైన చర్యలన్నింటినీ చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది.

అన్ని విద్యాసంస్థలకు ఒకే కరికులమ్

ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విద్యా సంస్థలకు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలకు ఒకే కరిక్యులమ్, ఒకే విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. క్రీడలను ప్రోత్సహించేందుకు వీలుగా తన నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా పరికరాలను కొనుగోలు చేసేందుకు తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి ఒక్కో పాఠశాలకు 50 వేల రూపాయల చొప్పున విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విధంగా చేస్తే క్రీడలకు ఆదరణ పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలలు నడుస్తున్న ఆవరణలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నడుస్తున్నట్లయితే వాటిని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ పథకంలో చేపట్టిన పనులను వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News