పీయూష్ గోయల్కు కెటిఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్: నాలుగు దక్షిణాది రాష్ట్రాల మధ్య పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కారిడార్ ఏర్పాటు ద్వారా పారిశ్రామిక వృద్ది మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులోని వెనకబడిన ప్రాంతాల అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే ఈ కారిడార్లో పరిశ్రమలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఏరో స్పేస్, ఢిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆటోమోబైల్ రంగంలో మరిన్ని కంపెనీలు వచ్చేందుకు వీలుందన్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న పలు పారిశ్రామిక ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. దక్షిణ భారతంలో కీలకమైన పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ హైదరాబాద్-…..బెంగళూర్….-చెన్నైను కలుపుతూ నాలుగు రాష్ట్రాల మధ్య దక్షిణాది పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారు. దీని వల్ల దక్షిణాదిలో పారిశ్రామిక ప్రగతి కోసం కేంద్రం ఇతోధిక సహాయం చేననట్లు అవుతుందన్నారు. ఇదే అంశంపై దక్షిణాది మంత్రులకు ఇప్పటికే లేఖలు కూడా రాసిన విషయాన్ని ఈ సందర్భంగా
కెటిఆర్ గుర్తు చేశారు.
ఈ కారిడార్ల ఏర్పాటు కోసం రానున్న బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. ఈ కారిడార్ల ఏర్పాటు చేస్తే అవసరమైన భూమి అందుబాటులో ఉంటుందా? అని పీయూష్ గోయాల్ మంత్రి కెటిఆర్ను అడిగారు. తెలంగాణలో అవసరం అయినంత భూమి అందుబాటులో ఉందని కేంద్రమంత్రికి ఆయన వివరించారు. ఈ కారిడార్ ప్రతిపాదనలపై పరిశీలన చేస్తామని ఆయన కెటిఆర్కు హామి ఇచ్చారు. అలాగే తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డ్రై పోర్ట్ తో పాటు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులకు నిధుల పరంగా మద్దతు ఇవ్వాలని కూడా మంత్రి కెటిఆర్ కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మా సిటీ, జహీరాబాద్ నిమ్జ్ గురించి వివరాలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీకీ ఇప్పటికే ఫార్మా రంగం నుంచి మంచి స్పందన వస్తున్నదని కేంద్ర మంత్రికి కెటిఆర్ వివరించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు. గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
ఇందులో భాగంగా పలు పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు వరంగల్…-హైదరాబాద్ కారిడార్ ఏర్పాటు చేసి పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నం చేస్తున్నదని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో పలు ఇండస్ట్రీయల్ కారిడార్ల మంజూరుపై కేంద్రమంత్రితో చర్చించారు. ముఖ్యంగా వరంగల్ -…. హైదరాబాద్, హైదరాబాద్… నాగ్ పూర్ల మధ్య రెండు కొత్త పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయాలని పీయూష్ గోయల్ను మంత్రి కెటిఆర్ కోరారు.
ఈ కారిడార్ల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని మంత్రి కెటిఆర్ వివరించారు. మంత్రి కెటిఆర్ ప్రస్తావించిన పలు అంశాలపైన వెంటనే ఒక నివేదిక ఇవ్వాలని తన కార్యాలయ సిబ్బందిని కేంద్ర మంత్రి ఆదేశించారు. కాగా వచ్చే నెల 17న హైదరాబాద్ లో జరిగే బయో ఆసియా సదస్సుకు హాజరుకావాల్సిందిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆహ్వానించారు.