‘లోక సంచారం చేయరా నరుడా జీవితం ఇంకెక్కడుందీ? జీవితమింకా ఉంటే గింటే నవ యవ్వన మింకెక్కడుందీ?” అని ఒక ఫకీరు హిందీలో పాడుతూ పోవడం చూసిన ఒక 11 ఏళ్ల పిల్లవాడికి ఆ పాట సారాంశం తలకెక్కింది. జీవితంలో యవ్వన దశలోనే తిరగగలిగినంత తిరగాలి. చేయగలిగినంత చేయాలి అని బోధపడింది. ఆ బాలుడి పేరు కేదార్ నాథ్ పాండే. ఆ పేరు ఇప్పుడు ఎవరికీ గుర్తు లేదు. రాహుల్ సాంకృత్యాయన్ అంటే మాత్రం ప్రపంమంతా గుర్తు పడుతుంది. బహు భాషావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, యాత్రా సాహిత్య పితామహుడు రాహుల్ సాంకృత్యాయన్ (1893 ఏప్రిల్ 9 1963 ఏప్రిల్ 14) జీవితంలో 45 సంవత్సరాలు యాత్రలలో గడిపిన లోక సంచారి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, బౌద్ధ భిక్షువుగా మారి, మార్కిస్ట్ సోషలిస్ట్గా పరివర్తన చెందిన ఆయన, భారత జాతీయోద్యమంలో కూడా కృషి చేశారు.
బ్రిటీష్ ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ రచనలు, ప్రసంగాలు చేసినందుకు మూడు సంవత్సరాలు జైలు శిక్షననుభవించారు. బ్రిటీష్ పాలనలో యు.పి (యునైటెడ్ ప్రావినెన్స్)లోని ఆజమ్గఢ్ జిల్లాలో జన్మించిన కేదార్ నాథ్ పాండే, క్రమంగా బౌద్ధాన్ని జీర్ణించుకుని, తన పేరును రాహుల్ సాంకృత్యాయన్గా మార్చుకున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో తాత అమ్మమ్మల వద్ద పెరిగాడు. ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. తర్వాత కాలంలో ఆ బాలుడు ఒక బహు భాషావేత్తగా, మహా పండితుడిగా స్వయంకృషితో ఎదుగుతాడని ఎవరూ ఊహించలేదు. ఫకీరు పాటకు ప్రభావితుడై ప్రపంచం ఏమిటో చూడాలని ఇంట్లోంచి పారిపోయాడు. అందువల్ల పాఠశాల చదువు ఎనిమిదవ తరగతితోనే ఆగిపోయింది.
కాలి నడకన వేల మైళ్లు ప్రయాణిస్తూ, మూడు బౌద్ధ పిటకాలను జీర్ణించుకుని త్రి పిటకాచార్య అయ్యారు. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియెట్ రష్యాలు పర్యటిస్తూ, ఎక్కడికి వెళితే అక్కడి భాష నేర్చుకుంటూ వచ్చారు. ఆ విధంగా అరబిక్, భోజ్పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలీ, నేపాలీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళ, తమిళం, ఉరుదూ వంటి ముప్పటికి పైగా భాషలు నేర్చుకున్నారు. అంతేకాదు వాటి యాసల్ని కూడా పట్టుకోగలిగారు. కాశీ విద్యాపీఠ్లో సంస్కృతం నేర్చుకున్న రాహుల్ జీ ఆర్యసమాజంలో హిందూమత వ్యాప్తికి కొన్నాళ్లు కృషి చేశారు. ఆ సమయంలోనే గ్రంథాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ప్రారంభించారు.
భిన్నమైన అభిరుచులు, లోతైన తాత్విక చింతన, నిరంతర సంచార జీవనం కలగలిపి అపురూప సాహిత్య రచనకు పూనుకున్నారు. దానితో పాటుగా తనదైన ఉపన్యాస శైలికి రూపకల్పన చేసుకున్నారు. పురాతన బౌద్ధ గ్రంథాలను వెలికి తీసి, వాటిని అనువదించి ప్రపంచానికి తెలియపరచడంలో రాహుల్ జీ చేసిన అపారమైన కృషిని బౌద్ధులు ఎంతో విలువైందిగా గుర్తించారు. ఒక్క భారత దేశంలోనే కాక యావత్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రతిభాశాలి మరొకరు లేరని ప్రముఖులెందరో వ్యాఖ్యానించారు. ఆయన రచనాశైలి సరళంగా, సామాన్యులకు సులభంగా అర్థమయ్యేట్లు ఉంటుం ది. ఇరవైయేళ్ల వయసులో రచన చేయడం ప్రారంభించి, మతం, తత్వం, భాష, సైన్స్, సోషియాలజీ వంటి అనేక విషయాల మీద పుస్తకాలు రాశారు.
ముఖ్యంగా బౌద్ధం మీద విస్తృతంగా పరిశోధన చేశారు. ‘ఓల్గా నుంచి గంగకు’, ‘రుగ్వేద ఆర్యులు’, ‘లోక సంచారి’, ‘దివోదాసు’, విస్మృత యాత్రికుడు’, ‘సింహ సేనాని’, ‘మధుర స్వప్నం’ ఆయన రచనల్లో కొన్ని. ‘ఓల్గా సే గంగ’ అనే ప్రసిద్ధ గ్రంథంలో ఆయన క్రీ.పూ. ఆరువేల నుండి క్రీ.శ. 1942 వరకు ఇండో యూరోపియన్ మానవ సమాజ వికాసాన్ని కథలుగా రాశారు. ఇది, ఇంకా మరికొన్ని రచనలు తెలుగులోకి అనువాదమయ్యాయి. మానవ జీవనయానం ఆంత్ర పాలజీలపై అభిరుచి ఉన్నవారు రాహుల్జీ రచనలు తప్పక చదవాలి. నిత్య సంచారిగా రాహుల్ సాంకృత్యాయన్ జీవితంలో సగం కన్నా ఎక్కువ కాలం సుదూర ప్రాంతాలు సందర్శించడానికే గడిపారు. వీలైనంత వరకు రోడ్లపైన, కాలిబాటలపైన ఆధారపడ్డారు.
కొత్త సంగతులు తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో ప్రయాణించారు. 13వ శతాబ్దంలో నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలను ఖిల్జీ ధ్వంసం చేసినపుడు బౌద్ధ భిక్షువులు తమ గ్రంథాలతో పారిపోయారని, వాటిని టిబెట్ ఆరామాల్లో భద్రపరిచారని రాహుల్ జీకి తెలిసింది. 600 ఏళ్లుగా వాటిని పట్టించుకున్న వారు లేరని ఆయన కార్యరంగంలోకి దూకారు. దారి సరిగాలేని కొండల్లో నడుస్తూ కశ్మీర్, లఢఖ్, కార్గిల్ల మీదుగా టిబెట్ వెళ్లారు. అక్కడ కొన్ని పుస్తకాలు లభించాయి గాని, అవి సంస్కృతంలో లేవు. అవన్నీ భోటీ భాషలో ఉన్నాయి. పుస్తకాల్ని కంచర గాడిదలపైకి ఎక్కించి, సుమారు నలభై రోజులు ప్రయాణించి రాహుల్ జీ చివరికి డార్జిలింగ్ దగ్గరలో ఉన్న కాళీపాంగ్ చేరారు.
ఆ గ్రంథాలన్నీ ఇప్పుడు పాట్నా మ్యూజియంలో ఉన్నాయి. టిబెట్ పర్యటనల్లో భాగంగా ఆయన టిబెటన్ భాష నేర్చుకున్నారు. దానికి వ్యాకరణం రాశారు. హిందీ టిబెటన్ నిఘంటువు కూర్చారు. నాటి సోవియెట్ యూనియన్ అంతా విస్తృతంగా పర్యటించి సంస్కృతం, పాళీ భాషల్లో ఉన్న శాసనాలు, రాతి ఫలకాలు సేకరించారు. నేపాల్, టిబెట్ మాత్రమే కాకుండా మంగోలియా, అఫ్ఘానిస్తాన్లో కూడా పర్యటించారు. అరుదైన కాన్జూర్, టాన్జూర్ గ్రంథాలు కొన్నారు. 130 వర్ణ చిత్రాలు 1600పై చిలుకు రాత ప్రతులు సేకరించారు. విదేశీ యాత్రికుడు హుయాన్ త్సాంగ్ తర్వాత, మళ్లీ అంత భారీగా పుస్తకాలు, చిత్రాలు సేకరించిన వారు మరొకరు లేరని చరిత్రకారుల అంచనా. ఆయన సేకరించిన పుస్తకాల్ని అమ్మమని చాలా మంది వెనకబడి ఒత్తిడి తెచ్చారు. అయినా ఆయన వినలేదు.
పరిశోధకులకు మాత్రం ఫోటోలు తీయించి ఉచితంగా ఇచ్చారు. ఆయన అంత నిక్కచ్చైన మనిషి. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆసక్తిని, నిబద్ధతను గమనించి కలకత్తాలోని మహాబోధి సొసైటీ, లండన్ బుద్ధిస్ట్ సొసైటీలు సంయుక్తంగా ఖర్చులు భరించి ఆయనను యూరోప్, అమెరికా దేశాల్లో బౌద్ధ మత వ్యాప్తి కోసం పంపించాయి.రాహుల్ సాంకృత్యాయన్కి జీవిత కాలంలో అనేక గౌరవాలు, బిరుదులు లభించాయి. 1958లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం, 1963లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అందాయి. ఆయనకు బాల్యంలోనే వివాహం జరిగింది కాని, ఇతను నిత్య సంచారి కావడం మూలాన వారెప్పుడూ కలిసి ఉండలేదు. అయితే లెనిన్ గ్రాడ్ యూనివర్శిటీలో పని చేస్తున్నప్పుడు మాత్రం ఒక మంగోలియన్ స్త్రీని వివాహమాడారు. భారత్కు తిరిగి వచ్చేప్పుడు సోవియెట్ నిబంధనలు ఒప్పుకోకపోవడం వల్ల ఆమె భారత దేశానికి రాలేకపోయింది. ఆ తర్వాత ఆయన కమల అనే భారతీయ యువతిని వివాహమాడి డార్జిలింగ్లో స్థిరపడ్డారు.
అందుకే ఆయన స్మృతి చిహ్నం డార్జిలింగ్లో బౌద్ధ మతానుసారం నిర్మించారు. రాహుల్ జీ ఎన్నో ఏళ్ల పాటు బీహార్ శరణ్ జిల్లా పర్శగద్ గ్రామంలో నివాసమున్నారు. అందుకే అక్కడి వారు గ్రామ ముఖ ద్వారానికి ‘రాహుల్ గేట్’ అని పేరు పెట్టుకున్నారు. చరమాంకంలో రాహుల్ సాంకృత్యాయన్ శ్రీలంకలో ఆచార్యుడిగా పని చేశారు. ఆ కాలంలోనే ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు. అయితే చివరలో గుండెల్ని పిండేసే విషాదమొకటి జరిగింది. రెఫరెన్స్ గ్రంథాలు కూడా కంఠోపాఠంగా ఉంచుకునే ఆ మహాజ్ఞాని, చివరి రోజుల్లో తన పేరేమిటో కూడా గుర్తు తెచ్చుకోలేని మతిమరుపులోకి జారిపోయారు. 1940 దశకం ప్రారంభంలో అంటే సుమారు 47 యేట ఆయన పూర్తిగా భౌతికవాద భావాలను స్వీకరించి, కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యునిగా చేరి, జీవితాంతం కమ్యూనిస్ట్గానే జీవించారు.
అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షునిగా ఆయన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు. బీహార్లో ఓ రైతు ఉద్యమంలో జరిగిన లాఠీ ఛార్జీలో ఆయనకు తలపై బలమైన దెబ్బ తగిలింది. జీవితంలో ఎప్పుడో తగిలిన ఆ బలమైన దెబ్బ కారణంగానో లేక సహజ వార్ధక్య లక్షణం గానో వచ్చిన మతిమరుపు వల్ల ఆయనెవరో ఆయనకు తెలియకుండా కొంత కాలం బతికారు. అధికారికంగా ఎక్కడా చదువుకోకపోయినా స్వయంకృషితో విశ్వవిద్యాలయాల్లో బోధించే స్థాయికి ఎదగడం, మహా పండితుడిగా గుర్తింపబడడం సామాన్య విషయం కాదు. ఇలాంటి మహా మేధావి ప్రపంచంలోనే మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
– డాక్టర్ దేవరాజు మహారాజు