వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం భారత దేశానికి అత్యాధునిక యుద్ధ విమానాలను విక్రయించడానికి ముందుకు వచ్చారు. ప్రపంచం లోనే అగ్రశ్రేణి స్టెల్త్ ఫైటర్ జెట్లలో ఒకటైన లాక్హీడ్ మార్టిన్ ఎఫ్ 35 లైటెనింగ్ 2 వ రకం యుద్ధవిమానాలను భారత్కు అందించేందుకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ సంవత్సరం నుంచి భారతదేశానికి మిలిటరీ ఉత్పత్తుల అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతామని,భారత దేశానికి ఎఫ్ 35 స్టెల్త్ ఫైటర్లను అందించడానికి మార్గం సుగమం చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని నరేంద్రమోడీతో సంయుక్త పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ట్రంప్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్ అమెరికాల మధ్య వాణిజ్య, దౌత్య సంబందాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలు వీరి చర్చల్లో చోటు చేసుకున్నాయి. ఆ తరువాత వీరిద్దరూ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత దేశ ఇంధన భద్రతను నిర్ధారించడానికి, చమురు, గ్యాస్ వాణిజ్యంపై దృష్టి పెడతామని ప్రధాని మోడీ అన్నారు 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్షం ” అని మోడీ తెలిపారు. ఈమేరకు పరస్పర ప్రయోజన కరమైన వాణిజ్య ఒప్పందం అతి త్వరలో వస్తుందని ఆశిస్తున్నారు.