జిఫీని సొంతం చేసుకొంటున్న సోషల్ మీడియా దిగ్గజం
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్ఫామ్లో వాటా దక్కించుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గ్జం ఫేస్బుక్ మరో ప్రముఖ వెబ్సైట్ను తన సొంతం చేసుకోనుంది. యానిమేటెడ్ ఇమేజెస్ లేదా జిఫ్లు రూపొందించే పాపులర్ వెబ్సైట్ జిఫీని కొనుగోలు చేయనున్నట్లు శుక్రవారం ఒక బ్లాగ్ పోస్టులో ఆ సంస్థ తెలిపింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్స్టాగ్రామ్ ఫోటో షేరింగ్ యాప్తో దీన్ని అనుసంధానం చేస్తున్నట్లు తెలిపింది. ఈ డీల్ వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ దీని విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.3035 కోట్లు) ఉండవచ్చని తెలుస్తోంది.
ఫేస్బుక్ యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ సైట్ ఇన్స్టాగ్రామ్లో ఇంటర్నెట్లో అత్యత ప్రాచుర్యం పొందిన జిఫీ భాగమవుతుంది. ఇకపై జిఐఎఫ్ లైబ్రరీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇతర యాప్లలో విలీనం కానుంది. అయితే ట్విట్టర్, స్నాప్చాట్, బైట్డ్యాన్స్, టిక్టాక్లాంటి సామాజిక వేదికలతో జిఫీ ప్రస్తుత అనుసంధానాలు మారవని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎప్పటిలాగానే వైడర్ ఎకోసిస్టంలో జిఫీ అందుబాటులో ఉంటుందని జిఫీ కూడా ప్రకటించింది. తాజా భాగస్వామ్యంతో గొప్ప కంటెంట్ను సృష్టించగలుగుతామని ఇన్స్టాగ్రామ్ ఉత్పత్తి ఉపాధ్యక్షుడు విశాల్ షా అన్నారు. యాంటీ ట్రస్ట్ ఆందోళనలు, రెగ్యులేటర్ల పరిశీలన ఉన్న సమయంలో ఫేస్బుక్ ఈ డీల్ను ప్రకటించడం గమనార్హం. కాగా న్యూస్ సైట్ టెక్ క్రంచ్ ప్రకారం జిఫీ 2015లో ఒక ఫేస్బుక్ ఆఫర్ను తిరస్కరించి స్వతంత్రంగా కొనసాగాలని నిర్ణయించుకొంది.