Tuesday, March 18, 2025

తప్పుడు సమాచారంతో ముప్పు

- Advertisement -
- Advertisement -

ఎదుటి మనిషి ఓ ఎత్తుకు చేరుకున్నప్పుడు ఆ స్ఫూర్తితో మనం అంతటి స్థాయిని అందుకోవాలని ఆరాటపడడంలో తప్పులేదు. అలాంటి ప్రయత్నమేదీ లే(చేయ)కుండా బురద జల్లో, రాళ్లు విసిరో మనకంటే ఓ మెట్టు కిందికి లాగాలనుకోవడం ముమ్మాటికీ అనైతికం. ఇలాంటి తీరు సమాజానికి శ్రేయస్కరం కాదు. ఆధునిక టెక్నాలజీ సాయంతో రూపొందుతున్న ఫేక్, డీఫ్ ఫేక్ వీడియోలు, ఎఐ డీప్‌ఫేక్ వీడియోల ఫోటోలు మార్ఫింగ్‌తో ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు, సినీ తారల వ్యక్తిగత జీవితాలను బజార్ కీడ్చడంతో కుటుంబాలు మానసిక ఆవేదనకు లోనవుతున్నారు.

ఆధునిక టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దాన్ని మంచికి వాడుకుంటే మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చు. చెడుకు వాడుకుంటే ఆ ఫలితాలన్నే ఎదుర్కోవాల్సి వస్తుంది. మానవ సంబంధాలు, సమాజ ప్రగతి, సామాజిక విలువలు, ఆర్థిక సమానతలతో మానసిక దృఢత్వాన్నిపెంపొందించుకున్నప్పుడే ఆధునిక టెక్నాలజీకి సార్ధకత. కానీ నేటి ఆధునిక సాంకేతిక కాలంలో నిజం చెప్పులేసుకోక ముందే- ఫేక్ న్యూస్ ప్రపంచాన్నే చుట్టేస్తుంది. అలా సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌న్యూస్ శరవేగంగా వ్యాపిస్తూ పెత్తనం చెలాయిస్తుంది. భారత్‌లో అసత్య ప్రచారం డీప్ ఫేక్ వీడియోల (ప్రసిద్ధ వ్యక్తుల చిత్రాలు, వీడియోలను చూపుతూ, వారు చెప్పినట్లుగా తప్పుడు సమాచారాన్ని కృత్రిమమేధతో వ్యాప్తిచేయడం) సమస్య తీవ్రమవుతోంది. ఎంతలా అంటే తప్పుడు సమాచారమే నిజం అనే రీతిలో ప్రచారం చేయడం బాగా పెరిగిపోయింది. ఫేస్‌బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాలు ఇందుకు వేదికలవుతున్నాయి.

ఫలానా కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెడితే అధిక ప్రతిఫలం వస్తుందంటూ ప్రసిద్ధ వ్యాపారవేత్తలు, చివరకు ఆర్‌బిఐ గవర్నర్ చెప్పారంటూ! రాజకీయ నాయకులు, సినిమా నటీనటులు, వ్యాపారవేత్తలు ఇలా అనేకమంది ప్రముఖులను అపఖ్యాతిపాలు చేసేలా! వారే చెప్పారనేలా సృష్టించబడతాయి. అంతేకాదు అబద్ధాల్ని నిజాల పక్కన నిర్భయంగా నిలబెట్టేస్తున్నారు. ఎవరికో, ఎవరితోనో అక్రమ సంబంధాలు అంటగడుతూ, మచ్చలేని వ్యక్తుల్ని కించపరుస్తారు. ఘన విజయాలు కూడా తేలికచేసి చూపడం, మాట్లాడడం పెరిగిపోతోంది. ఇలాంటి విపరీత ప్రవర్తనలు సామాజిక మాధ్యమాలకు వేదికగా మారుతున్నాయి. వ్యక్తుల సమూహమే సమాజం. వ్యక్తులు ఉన్నత స్థాయికి సామాజిక విలువలతో చేరు సమాజం ప్రగతి వైపు ప్రయాణిస్తుంది. ఎదుటి మనిషి ఓ ఎత్తుకు చేరుకున్నప్పుడు ఆ స్ఫూర్తితో మనం అంతటి స్థాయిని అందుకోవాలని ఆరాటపడడంలో తప్పులేదు. అలాంటి ప్రయత్నమేదీ లే(చేయ)కుండా బురద జల్లో, రాళ్లు విసిరో మనకంటే ఓ మెట్టు కిందికి లాగాలనుకోవడం ముమ్మాటికీ అనైతికం. ఇలాంటి తీరు సమాజానికి శ్రేయస్కరం కాదు. ఆధునిక టెక్నాలజీ సాయంతో రూపొందుతున్న ఫేక్, డీఫ్ ఫేక్ వీడియోలు, ఎఐ డీప్‌ఫేక్ వీడియోల ఫోటోలు మార్ఫింగ్‌తో ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు, సినీ తారల వ్యక్తిగత జీవితాలను బజార్ కీడ్చడంతో కుటుంబాలు మానసిక ఆవేదనకు లోనవుతున్నారు.

సమాజాన్ని వక్రమార్గం పట్టిస్తున్నాయి. ఇలాంటి వేళ తక్షణమే వీటి నిరోధానికి మార్గాలు అన్వేషించాలంటూ ప్రభుత్వాలపై ఒత్తిడి అధికమవుతుంది. ఈ సమస్యపై ఐఎస్‌బి (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్), సైబర్ పీస్ అనే సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి. అసత్య ప్రచారం 77.4% సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రచారంలోకి వస్తోంది. అందులో ఎక్స్ ద్వారా 61%, ఫేస్‌బుక్ ద్వారా 34% అసత్య ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది. వార్తలు, సమాచారం కోసం సామాజిక మాధ్యమాలను చూస్తున్నవి నియోగదారుల సంఖ్య దాదాపు 74.89 శాతానికి చేరింది. అందులోనూ 68.21% మంది వీడియో సమాచారాన్ని ఇష్టపడుతున్నారు. తప్పుడు వార్తల ప్రభావానికి లోనయ్యే వారిలో 18-24 సంవత్సరాల యువత అధికంగా ఉంటోంది. వీరిలోనూ తక్కువ ఆదాయాలు గల కుటుంబ సభ్యులు, తక్కువ విద్యార్హతలు గల యువతీ యువకులే ఎక్కువ. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరుతున్న తప్పుడు వార్తల్లో రాజకీయ రంగానికి సంబంధించినవి 46% ఉంటున్నాయి. సాధారణ అంశాలు, మత సంబంధ విషయాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఫేక్ మనుషులతో, ఫేక్ సమాచారంతో, ఫేక్ వీడియోలతో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉందనేది ఈ నివేదిక సారాంశం. సామాజిక మాధ్యమాల్లో కనిపించే తప్పుడు వార్త (ఫేక్ న్యూస్), పూర్తిగా తప్పు లేదా పూర్తిగా నిజం కాని సమాచారాన్ని ఫేక్ న్యూస్ అంటారు. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరు పంపుతున్నారు స్పష్టంగా వెల్లడికాదు. ఏదో ఒక ఐడి నుంచి వచ్చి సోషల్ మీడియాలో చలామణి అవుతుంది.

ఐడి కూడా ఫేక్‌దే కావచ్చు. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా లో ప్రచారంలోకి తెస్తున్నారు. తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారు. ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఇటువంటి అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అది తప్పుడు వార్త అనే అనుమానం రానంత పకడ్బందీగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తారు. సోషల్ మీడియా వేదికలన్నింటిలోనూ దీన్ని వైరల్ చేస్తారు. తప్పుడు సమాచారం ఫేక్ న్యూస్ వీడియోల వల్ల రాజకీయ పార్టీ(నాయకు)ల జయాపజయాలను, ప్రవర్తనను ప్రభావితం చేస్తోంది. వ్యాపార దిగ్గజాలు, సినీ ప్రముఖులు, పాలక ప్రతిపక్షాలు, మాన్యులు, సామాన్యులు ఇలా ఎంతో మంది సమాజంలో ఇబ్బందులు పడుతున్నారు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలియక తల్లడిల్లిపోతున్నారు. అంతెందుకు మన రాష్ట్ర రాజధానిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి, తన తోటి విద్యార్థిని ఫోటోలను మార్ఫింగ్ చేసి నాతో ఒంటరిగా గడపాలని లేదంటే? సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఉదంతాలను చూస్తుంటే..

టెక్నాలజీ ఎవరికోసం ఎందుకు వచ్చిందో ఇలా టెక్నాలజీని విచక్షణ కోల్పోయి దుర్వినియోగం చేస్తున్న తీరు అమానుషం. టెక్నాలజీని మంచికోసం ఉపయోగించాలి గాని సమాజ విలువలు తగ్గించే చర్యలు మంచిది కాదు. ఆధునిక నాగరికత ముసుగు వేసుకున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సామాజిక రుగ్మతను నిరోధించడానికి సమష్టి కృషి ఎంతో అవసరం.సైబర్ సెక్యూరిటీ చర్యలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి, ప్రజలు కూడా సమష్టి బాధ్యతతో వ్యవహరించాలి. అసత్యాల ప్రచారాన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలకు పూనుకోవాలి. సాంకేతిక పరిష్కారాలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రచార సాధనాలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన పెంపొందించాలి.

మేకిరి దామోదర్
95736 66650

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News