హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంఇడి, బిపిఇడి, డిపిఇడి, యుజిడిపెడ్ కోర్సులు అందిస్తున్న ప్రైవేట్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజులు ఖరారయ్యాయి. కళాశాలల ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రవేశాలు, ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టిఎఎఫ్ఆర్సి) నిర్ణయించిన ఫీజులను ఖరారు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్యూషన్ ఫీజులు మూడు సంవత్సరాల పాటు అమలులో ఉండనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంఇడి ఫీజు కనిష్టంగా రూ.25 వేలు, గరిష్టంగా రూ.36గా నిర్ణయించారు.
బిపిఇడి ట్యూషన్ ఫీజు కనిష్టంగా రూ.20 వేలు, గరిష్టంగా రూ.25 వేలు నిర్ణయించారు. అలాగే డిపిఇడి ట్యూషన్ ఫీజు రూ.30 వేలు, యుజిడిపిఇడి ఫీజు రూ.25 వేలుగా ఖరారు చేశారు. ఎంఇడి కోర్సులకు పెద్దపల్లిలోని ట్రినిటీ కళాశాలలో కనిష్టంగా రూ.25 వేలు ఫీజు నిర్థారించగా, ఎంఎన్ఆర్ కళాశాలలకు గరిష్టంగా రూ.35 వేలుగా నిర్ధారించారు. బిపిఇడి కోర్సులకు మెదక్లోని బివికె కళాశాలకు కనిష్టంగా రూ.20 వేలు ఫీజు, శామిర్పేటలోని హజి గౌస్ పీరన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలకు గరిష్టంగా రూ.25 వేలుగా ఖరారు చేశారు.