ఎంఎల్ఎ కోటా ఎంఎల్సి
అభ్యర్థులుగా అద్దంకి దయాకర్,
విజయశాంతి, శంకర్ నాయక్
కాంగ్రెస్ ప్రకటన అభ్యర్థుల
ఎంపికలో సామాజిక సమతూకం
బిఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు
శ్రవణ్, సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి
సత్యం యాదవ్ నేడు నామినేషన్ల దాఖలు నల్లగొండ జిల్లాకు
నాలుగు ఎంఎల్సిలు
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యేల కోటా నుంచి ఐదు ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా మూడు కాంగ్రెస్కు, ఒకటి బిఆర్ఎస్ కు వస్తాయి. ఐదో స్థానం కోసం ఎంఐఎంతోపాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారు ఓట్లు
వేస్తే కాంగ్రెస్కు నాలుగో సీటు లభించే అవకాశం ఉన్నా సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని సీపీఐ కోరింది. సీపీఐ అగ్ర నాయకత్వం కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మాట్లాడారు. దీంతో ఆ పార్టీకి ఒక స్థానం కేటాయించారు. అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే సీపీఐ రాష్ట్ర కార్యవర్గం చర్చిస్తోంది. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీ ఆశావహుల్లో నెల్లికంటి సత్యం యాదవ్, చాడ వెంకటరెడ్డి ఉన్నారు. సీపీఐ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.
మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ : టీడీపీ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు తర్వాత మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. కావలి గ్రీష్మ(ఎస్సీ), బీద రవిచంద్ర (బీసీ), బీటీ నాయుడు (బీసీ)కు అవకాశం కల్పించారు. సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుండటంతో ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.