Sunday, September 8, 2024

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఆర్టిసి క్రాస్ రోడ్ లోని దత్త సాయి కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరినీ పోలీసులు రక్షించగా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సప్తగిరి థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ మూడవ అంతస్తు లోని టప్పట్ వేర్ గోదాములో సాయంత్రం ఆరు గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ముషీరాబాద్ అగ్నిమాపక సిబ్బంది , చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహకారంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

అప్పటికే అక్కడి గోద్రెజ్ కార్యాలయంలో ఉన్న ఇద్దరు సిబ్బంది పొగల్లో చిక్కుకున్నారు. వీరిని గుర్తించిన చిక్కడపల్లి ఇన్స్‌పెక్టర్ సీతయ్య అటు వైపుగా మంటలను నిలువరించే ప్రయత్నం చేసి కార్యాలయంలోని సురేందర్ , శ్రీధర్‌లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరో పక్క నాలుగు ఫైర్ ఇంజన్లతో దాదాపు రెండున్నర గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. నీళ్ళు, ఫూమ్ స్ప్రే సహాయంతో అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బందిలో ఒకరికి ఊపిరి ఆడకపోవడంతో వెంటనే అతడిని స్థానికంగా ఉన్న ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనేది తెలియాల్సి వుంది. కాగా అగ్ని ప్రమాదం కారణంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిసరాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News