పాతికేళ్ల కిందట ఇదేరోజు
సుఖ్రామ్ జ్యోతిబసు మొబైల్ టాక్
న్యూఢిల్లీ : ఇప్పుడు అందరి చేతుల్లో అత్యవసర సరుకుగా మారిన సెల్ఫోన్కు జూలై 31వ తేదీకి సంబంధం ఉంది. శుక్రవారం జులై 31వ తేదీ. సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 1995 జులై 31వ తేదీన దేశంలో తొలి మొబైల్ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఈ రికార్డు సంభాషణ జరిగింది. అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి , కమ్యూనిస్టు దిగ్గజం జ్యోతిబసు, అప్పటి కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ మంత్రి సుఖ్రామ్ మధ్య తొలి సెల్ ఫోన్ సంభాషణ జరిగింది. తరువాత సెల్ఫోన్ ఇంటింటికి విస్తరించుకుంటూ పోయింది. పలు మోడల్స్, అత్యంత అధునాతన నెట్ సౌకర్యాలు నెలకొన్నాయి. కోల్కతాలో అధికార కార్యకలాపాల భవనం రైటర్స్ బిల్డింగ్లో ఉన్న సిఎం జ్యోతిబసుతో అప్పటి టెలికాం మంత్రి సుఖ్రాం ఢిల్లీలోని సంచార్ భవన్ నుంచి మొబైల్ కాల్ ద్వారా మాట్లాడారు.
కాకలుతీరిన ప్రతిపక్ష నేత, పలు సార్లు సిఎం అయిన బసును కేంద్ర ప్రభుత్వం ఈ ఫోన్ సేవల తొలి పలకరింపుల కోసం ఎంచుకోవడం విశేషం. అప్పుడే కోల్కతాలో మొబైల్ నెట్ సేవలు ఆరంభం అయ్యాయి. దేశంలో టెలీకమ్యూనికేషన్స్ సర్వీసు కూడా 1995లో విస్తృతస్థాయిలో మొదలైంది. తరువాతి దశలో ఫోన్ల రంగంలో విస్తృత మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో సెల్ఫోన్ ఉండటం కేవలం లగ్జరీ. అంతా ల్యాండ్ఫోన్లపై, ట్రంకాల్స్పై ఆధారపడేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. 2020 మార్చి 31 నాటికి దేశంలో 99 కోట్ల వరకూ యాక్టివ్ వైర్లైస్ ఖాతాదార్లు ఉన్నారు. ఈ పాతికేళ్లలో సాంకేతికంగా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంటర్నెట్ అనుసంధాన ఫోన్లు వచ్చాయి. 2 జి, 3 జి, నెట్వర్క్లు దాటి ఇప్పుడు దేశం 4జిల దశలో ఉంది. త్వరలోనే 5 జి శకం ఆరంభం కానుంది.