రహదారి నిమిత్తం అటవీ భూమి నుంచి మట్టిని తోలుకునేందుకు గుత్తేదారు నుంచి లంచం డిమాండ్ చేసిన ఓ అటవీ శాఖ అధికారి, బీట్ ఆఫీసర్ను ఎసిబి అధికారులు పట్టుకున్న ఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కొమారారం అటవీశాఖ అధికారి ఉదయ్ కిరణ్ ,బీట్ ఆఫిసర్ హరిలాల్ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. రహదారి నిమిత్తం అటవీ భూమి నుండి మట్టిని తోలుకునేందుకు గుత్తేదారు నుంచి రూ.30 వేలు డిమాండ్ చేశారు.
ఇంతకు ముందే రూ.20 వేలు లంచంగా ఇచ్చినట్లు సమాచారం. మళ్లీ గ్రావెల్ తీస్తుండగా అటు అటవీశాఖ సిబ్బందిని పంపించి జెసిబిని, ట్రాక్టర్ను పట్టుకున్నారు. జెసిబి, ట్రాక్టర్ను విడిచి పెట్టేందుకు రూ.15 వేల లంచం తీసుకున్నట్లుగా సమాచారం. అయినప్పటీకీ మళ్లీ గ్రావెల్ తోలుకునేందుకు రూ.50 వేలు డిమాండ్ చేయగా రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో గుత్తేదారు ఎసిబిని ఆశ్రయించడంతో మంగళవారం ఎసిబి డిఎస్పీ రమేష్ ఆధ్యర్యంలో దాడులు నిర్యహించి రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.