న్యూఢిల్లీ : తండ్రీ కొడుకులను తగులబెట్టిన కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్కుమార్ దోషిగా తేలాడు. ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈనెల 18న ఆయనకు ఏశిక్ష విధించాలనేది ఖరారు చేయనున్నట్టు కోర్టు తెలిపింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 18 కి వాయిదా వేసింది. 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఈ సందర్భంగా డిల్లీలో జశ్వంత్ సింగ్, తరుణ్దీప్ సింగ్ ఇంటిపై పలువురు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఇల్లును లూటీ చేశారు. ఆప్ ఇంటికి నిప్పు పెట్టారు.
ఈ సంఘటనలో ఇంట్లోని తండ్రీ కొడుకులు సజీవ దహనమయ్యారు. దీనిపై కోర్టు ఆదేశాలిస్తూ ఈ దారుణానికి పాల్పడిన మూకలో సజ్జన్కుమార్ కేవలం ఒక సభ్యుడిగా ఉండలేదని, ఆ మూకలకు నాయకత్వం వహించాడని వ్యాఖ్యానించింది. నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులో సజ్జన్ కుమార్ ఇప్పటికే జీవితఖైదు అనుభవిస్తున్నారు. అదే అల్లర్ల సందర్భంగా ఢిల్లీ లోని సరస్వతి నగర్ లో తండ్రీ కొడుకులు ఇద్దరినీ తగుల బెట్టి సజీవ దహనం చేసిన కేసులో కూడా నిందితుడిగా ఉన్న సజ్జన్ కుమార్ను కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. ఈమేరకు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా అదేశాలు జారీ చేశారు. సజ్జన్ కుమార్ను తీహార్ జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు.