Wednesday, October 16, 2024

నేడు 28 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైన విద్యను అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం వివిధ జిల్లాల్లోని 28 ప్రాంతాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. మొదటి దశలో చేపట్టనున్న ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత జిల్లాల కలెక్టర్లతో గురువారం సిఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి అజిత్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావులు ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గంలోని

కొందుర్గ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. శుక్రవారం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధిత జిల్లాల మంత్రుల, ఇంజార్జ్ మంత్రుల ఆమోదం పొందిన అనంతరం ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సవ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు. ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులందరినీ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించాలని స్పష్టం చేశారు. ఈ స్కూళ్ల నిర్మాణాలను రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, ఇంజనీర్లతో శంకుస్థాపన జరిగే ప్రాంతాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న ఈ 28 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రెండవ దశలో ఇతర ప్రాంతాల్లో భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని సిఎస్ తెలిపారు.

శంకుస్థాపన జరిగే 28 నియోజకవర్గాలు : కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్ చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పర్కాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలలో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News