న్యూఢిల్లీ: పహల్గామ్లో ఉగ్రవాదులు దారుణ మారణహోమానికి పాల్పడి నేటికి వారం రోజులు పూర్తయింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు మృత్యువాత పడ్డారు. ఈ దాడి తర్వాత కేంద్రం పాకిస్థాన్కు బుద్ధి వచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద నిర్మూలనకు దృఢచిత్తంతో ఉన్నమని ప్రధాని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడం జాతీయ సంకల్పం అని ఆయన అన్నారు. సాయుధ దళాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉందని ఆయన తెలిపారు.
తీవ్రవాదం అణిచివేయడంలో, అందుకు తగిన కార్యాచరణ రూపొందించుకోవడంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎప్పుడు, ఎలా స్పందించాలో నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ పూర్తిగా సైన్యానిదే అని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం దాదాపు గంటన్నరపాటు కొనసాగింది. ఈ సమావేశంలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ పాటు వివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.