Saturday, June 29, 2024

యాదాద్రిలో వైభవంగా గిరిప్రదక్షిణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకొని మంగళవారం గిరిప్రదక్షిణ నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆధ్యాత్మికత వైభవాన్ని మరింత చాటేందుకు, ఆలయ విశిష్టతను చాటేలా గిరిప్రదక్షిణ ప్రచారం నిమిత్తం దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి స్వాతినక్షత్రాన్ని పురస్కరించుకొని అశేష భక్తులు గిరిప్రదక్షిణ చేయగా స్వామివారి క్షేత్రంలో అష్టోత్తర శతఘటాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ వేడుకలకు గిరిప్రదక్షిణతో పాటు శతఘటాభిషేకంలో భక్తులు పాల్గొని తీర్ధప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గిరిప్రదక్షిణ, అష్టోత్తర శతఘటాభిషేకం విశిష్టతను భక్తులకు తెలియజేశారు.

కాగా, యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదగిరికొండ గిరిప్రదక్షిణ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతుందని ప్రభుత్వ విప్, స్థానిక ఎంఎల్‌ఎ బీర్ల అయిలయ్య అన్నారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆయన సింహద్వారం వద్ద శ్రీలక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలు చేసి గిరిప్రదక్షిణ ప్రారంభించగా, అన్ని వర్గాల ప్రజలు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామివారి కొండపైకి మెట్ల ద్వారా ఎంఎల్‌ఎతో పాటు ఆలయ ఇఒ భాస్కర్‌రావు, సిబ్బంది, భక్తులు కొండపైకి చేరుకున్నారు.

సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా వెళ్లి శ్రీలక్ష్మీనరసింహుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. యాదాద్రి క్షేత్ర విశిష్టతను తెలియజేయడానికే దేవస్థానం ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణను వైభవంగా నిర్వహించామని తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసేందుకు కృషిచేస్తున్నామని అన్నారు భక్తుల రద్దీ ఉన్న సమయంలో కూడా ఒక గంటలో భక్తులకు దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడానికి కృషిచేస్తున్నామని అన్నారు. యాదాద్రి గిరిప్రదక్షిణతో తన జన్మధన్యమైందని, రాష్ట్ర ప్రజలతో పాటు అనేక ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News