Tuesday, September 17, 2024

కనకదుర్గమ్మకు బంగారు బోనం

- Advertisement -
- Advertisement -

ఆషాడ మాసం సందర్భముగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య, కమిటీ సభ్యులు ఆదివారం అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు వారికి స్వాగతం పలికారు. అనంతరం బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి నందలి దేవతామూర్తుల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతులు, తెలంగాణా బొనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ వారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణా బోనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ వారు జమ్మిదొడ్డి నుంచి పోతురాజుల విన్యాసాలు, వివిధ కళాకారుల వేషధారణలు,

నృత్యాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలుతో సుమారు వెయ్యిమందికి పైగా ఊరేగింపుగా బయలుదేరి రధం సెంటరు, ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారికి సమర్పించు బంగారు బోనం తలపై ఉంచుకుని దుర్గా ఘాట్ వద్ద కృష్ణ నది గంగ తెప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆలయానికి కాలినడకన చేరుకోగా కార్యనిర్వహణాధికారి స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ బొనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని, పూజలు నిర్వహించి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వాహణాధికారి అమ్మవారి శేష వస్త్రాలు, ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని రావి చెట్టు వద్ద ఉన్న దేవతామూర్తులకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు, సభ్యులు, ఆలయ వైదిక సిబ్బంది, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News