ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు భారీ ఉపశమనం లభించింది. వారి వీసాలు /చట్టబద్ధ హోదాను రద్దు చేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ సర్కారు వెనక్కి తగ్గింది. ఆ విద్యార్థుల లీగల్ స్టేటస్ను పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. అక్రమ వలసదారుల రీతిలోనే విదేశీ విద్యార్థుల పైనా ఉక్కుపాదం మోపిన ట్రంప్ ప్రభుత్వం వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా వారి చట్టబద్ధ హోదాలను రద్దు చేసింది. దీంతో డిపోర్టేషన్ , నిర్బందం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను విడిచిపెట్టగా, కొందరు రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు. ఇంకొందరు క్లాసులకు వెళ్లడం లేదు. తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
ఈ మేరకు కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానాలు విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించాయి. దీంతో ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తాత్కాలికంగా పునరుద్ధరించింది. సాధారణంగా వీసా లేదా చట్టబద్ధ హోదా రద్దయినప్పుడు , విదేశీ విద్యార్థుల వివరాలను పొందుపర్చే ఎస్ఇవిఐఎస్ (స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ) డేటా బేస్ నుంచి వారి వివరాలు తొలగిస్తారు. అయితే ఈ రికార్డుల టెర్మినేషన్కు సంబంధించిన ట్రంప్ సర్కారు త్వరలోనే కొత్త పాలసీ తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అప్పటివరకు తొలగించిన విద్యార్థుల రికార్డులన్నింటినీ తిరిగి యాక్టివేట్ చేస్తున్నట్టు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు. వీసాలు రద్దయిన వారిలో కొంతమంది భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి చాలా చిన్న కారణాల తోనే వారి చట్టబద్ధ హోదాను తొలగించినట్టు అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ పేర్కొంది.