Thursday, September 19, 2024

మహిళలకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

మహిళలకు ఎపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుపై కీలక ప్రకటన చేసింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సిఎం చంద్రబాబు వెల్లడించారు. పండుగ రోజున ఫ్రీగా మొదటి సిలిండర్ అందిస్తామన్నారు. ఈ విషయాన్ని మంగళగిరిలోని సికె కన్వెన్షన్‌లో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో వెల్లడించారు. కాగా, ఎన్నికల హామీల్లో భాగంగా మహాశక్తి పథకం కింద పేదలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికీ 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. అలాగే, నియోజకవర్గాల వారీగా ఎంపిలు, ఎంఎల్‌ఎలు విజన్ డాక్యుమెంట్లు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పు, రూ.లక్ష కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. కేంద్ర నిధులు పక్కదారి పట్టాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో డబ్బులు లేవని.. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అయినా ధైర్యంతో ముందుకెళ్తున్నామన్నారు.

3 పార్టీల సమిష్టి కృషితోనే ఇంతటి ఘన విజయం సాధించామని పునరుద్ఘాటించారు. కేంద్ర సహకారం లేకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పని చేస్తున్నామని చెప్పారు. 151 సీట్లు ఉన్నాయని గర్వంతో విర్రవీగిన వారు ఇప్పుడు 11 సీట్లకే పరిమితమయ్యారని ఇదే ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. ’తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష అనుభవించక తప్పదు. జగన్ అన్నా క్యాంటీన్ రద్దు చేసి దుర్మార్గంగా వ్యవహరించారు. వైసిపి హయాంలో తప్పులు చేసిన వారిని వదిలిపెట్టను. అదే సమయంలో మనం తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ప్రజలు మనందరిపై నమ్మకంతో గెలిపించారు. మనందరి ప్రవర్తన ప్రజలు ఆమోదించే విధంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం చేస్తోన్న మంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వచ్చే రెండేళ్లలో పోలవరం ఫేజ్ -1 పూర్తి చేస్తాం. ప్రాజెక్టు ను పూర్తి చేసి జాతికి, రైతులకు అందిస్తాం. అమరావతికి నిధుల కొరత లేదు. ముందుకు తీసుకెళ్తాం. గత 5 ఏళ్లు కనీసం విశాఖ రైల్వే జోన్ తెచ్చుకోలేక పోయారు. కేంద్రం అడిగిన భూమి ఇవ్వలేక పోయారు. మన ప్రభుత్వం వస్తూనే ల్యాండ్ క్లియర్ చేశాం. తొందర్లోనే విశాఖ రైల్వే జోన్ పనులు మొదలవుతాయ.’ని చంద్రబాబు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News