Thursday, September 19, 2024

నిరుపేదల జీవితాల్లో మార్పు తేవడమే తమ ప్రభుత్వ లక్ష్యం: బ్రాక్ ప్రతినిధులతో మంత్రి సీతక్క వెల్లడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌: నిరుపేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. అయితే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఫలాలు పేదలకు చేరటం లేదని అన్నారు. పలు దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పని చేస్తున్న అంతర్జాతీయ సంస్థ బ్రాక్ ప్రతినిధులతో సచివాలయంలో మంగళవారం సమావేశమైన మంత్రి సీతక్క మాట్లాడుతూ మారు మూల ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి రంగాల్లో పనిచేస్తున్న బ్రాక్, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని అన్నారు.

తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులను, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన బ్రాక్ ఈ సమావేశంలో ఆ వివరాలను మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మారిన పరిస్థితులు అవసరాల నేపథ్యంలో పేదలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు. పేదరికం నుంచి వచ్చిన నాకు పేదలతో పేగు బంధం ఉందని అన్నారు. సమాజంలో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిరుపేదలకు అట్టడుగు, వర్గ ప్రజలకు కనీస వసతులు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బహు రూపాల్లో పేదరికం ఇంకా కొనసాగటం బాధాకరమని అన్నారు. పేదరికన్ని రూపుమాపే దిశలో అంతా కలిసి పని చేయాలని కోరారు. అందరం అంకితభావంతో పని చేస్తే పేదరికం అనేది ఉండదని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని వివరించారు. క్షేత్రస్థాయిలో పథకాలు అమలవుతున్న తీరును బ్రాక్ వంటి సంస్థలు అధ్యయనం చేయడం అభినందనీయమని తెలిపారు. పేదరిక నిర్మూలన కోసం తమ పభుత్వం చేస్తున్న పోరాటంలో పాలుపంచుకోవాలని కోరారు. పేదలకు మెరుగైన విద్యా, వైద్యం, ఉపాధి కల్పనలో తమప్రభుత్వానికి చేయూత నివ్వాలని కోరారు. బ్రాక్ అడ్వైజర్ శ్వేతా బెనర్జీతో పాటు పలువు ప్రతినిధులను మంత్రి సీతక్క ఈ సందర్భంగా సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News