Tuesday, September 17, 2024

కాంగ్రెస్ హయాంలో పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి : హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ కష్టంగా మారిందని తాము చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతుందని ఆక్షేపించారు. తాము పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారని, అసలు ఏది అబద్ధం..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నా గ్రామ పంచాయతీలకు ఇప్పటికి 9 పైసలు కూడా చెల్లించలేదనేది అబద్ధమా..? అని నిలదీశారు. ఈ మేరకు హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం నుంచి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన రూ.2,100 కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్లించింది అబద్ధమా..? అని అడిగారు. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ. 500 కోట్ల రూపాయలు నిధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఆపింది అబద్ధమా..? అని ప్రశ్నించారు.

గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధం ఆటకెక్కడం అబద్దమా..?..గ్రామాల్లో పారిశుద్ద లోపంతో డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలడం అబద్దమా..?..8 నెలలుగా జెడ్‌పిటిసి, ఎంపిటిసిలను గౌరవ వేతనం ఇవ్వకపోవడం అబద్ధమా..? అని నిలదీశారు.మాజీ గ్రామ సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఛలో సచివాలయం పిలుపునిస్తే వారిని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలకు నెలనెలా రూ. 275 కోట్లు, సంవత్సరానికి రూ. 3,300 కోట్ల నిధులు విడుదల చేసింది నిజం కాదా..? అని మంత్రి సీతక్కను అడిగారు. ఈ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించకుండా సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నది పచ్చి నిజం అని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని హరీశ్ రావు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News