న్యూఢిల్లీ: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గ్రామీ’ అవార్డును భారత సంతతికి చెందిన గాయని, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ గెలుచుకున్నారు. బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ లేక చాంట్ ఆల్బమ్ కేటగిరిలో ఆమె ఆల్బం ‘త్రివేణి’ అవార్డును దక్కించుకుంది. లాస్ ఏంజెల్స్లోని క్రిప్టో డాట్ కామ్ ఎరేనాలో ఆదివారం 67వ గ్రామీ అవార్డ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మ్యూజికల్ అవార్డు కార్యక్రమాన్ని రికార్డింగ్ అకాడమీ నిర్వహించింది. చెన్నైలో పెరిగిన చంద్రిక అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె పెప్సీ కంపెనీ ఇండియా సిఈవో అయిన ఇంద్రా నూయీకి అక్క. చంద్రిక చెన్నైలోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమెకు చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ ఉంది. ఆమె తల్లి సంగీత విద్వాంసురాలు కావడంతో చంద్రికకు సంగీత శిక్షణ సులభతరం అయింది.
ఆమె వ్యాపార రంగంలో రాణిస్తూనే సంగీత ప్రపంచంలో కూడా వెలుగుతున్నారు. చంద్రికా టాండన్కు మరోసారి గ్రామీ-2025 అవార్డు దక్కడంతో ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆమెకు ఇదివరలో అంటే 2009 దశకంలో ‘సోల్ కాల్’ అనే ఆల్బమ్కు తొలి గ్రామీ అవార్డు లభించింది. చంద్రిక తన అవార్డు గ్రహణ ప్రసంగంలో ‘సంగీతం అంటే ప్రేమ, కాంతి, నవ్వు…మనమందరం ప్రేమ, కాంతి, నవ్వులతో నిండిపోదాం. సంగీతానికి, సంగీతాన్ని అందించే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంది. ఏడు ట్రాక్లు ఉన్న ఆమె ‘త్రివేణి’ ఆల్బం 2024 ఆగస్టు 30న విడుదలయింది. అందులో పాత్ వే టు లైట్, ఛాంట్ ఇన్ ఏ, జర్నీ వితిన్, ఏథెర్స్ సెరెనాడే, యాన్సియంట్ మూన్, ఓపెన్ స్కై, సీకింగ్ శక్తి అనే పాటలు ఉన్నాయి. 2025 గ్రామీ అవార్డుల ప్రత్యక్ష ప్రసారం ఇండియాలో డిస్నీ+ హాట్స్టార్లో ప్రసారమైంది.