Thursday, September 19, 2024

వరద నష్టాన్ని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యల

- Advertisement -
- Advertisement -

కాలువలు, చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు.
రాష్ట్ర వ్యాప్తంగా 773 చెరువులు, కాలువలకు గండ్లు.
కేంద్ర ప్రభుత్వ సహయాన్ని కోరుతూ నివేదిక.
తాత్కాలిక మరమ్మతులకు రూ. 75 కోట్లు
శాశ్వత పునరుద్ధరణకు రూ.483 కోట్ల మంజూరీకి వినతి.
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న కాలువలు, చెరువులు, పంప్ హౌజ్ లతో పాటు చెక్ డ్యామ్ ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. ఖరీఫ్ పంటలను కాపాడడంతో పాటు నీటిసరఫరా పునరుద్ధరణ లక్ష్యంగా చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగా ఆదివారం నాడు హుజుర్నగర్, కోదాడ నియోజకవర్గాలలో స్వయంగా పర్యటించి పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్ మ్యాప్ రూపొందించుకున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ మొదటి వారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఏర్పడిన విపత్తు నుండి బయట పడేందుకు నీటిపారుదల శాఖా ప్రత్యేక దృష్టి సారించింది.

ప్రధానంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు , కొత్తగూడెం జిల్లాలో 250 మీ.మీ. నుండి 450 మీ.మీ. వర్షపాతం నమోదు కావడంతో ఈ నష్టం జరిగినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. పాలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ తోటే సాగర్ ఎడమ కాలువకు గండ్లు పడ్డాయని నీటిపారుదల శాఖ నిర్దారణకు వచ్చింది. దానికి కొనసాగింపుగానే కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం కాగితంరామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండి పడడటంతో, ఆ ప్రభావం అటు కోదాడ ఇటు హుజుర్నగర్ నియోజకవర్గాలపై పడింది.

రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవిస్తాయని భారత ప్రభుత్వ వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన నీటిపారుదల , పౌరసరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు ఇటు అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తూ , అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిస్థితులను వివిరింస్తూ వచ్చారు. అంతే గాకుండా సాగర్ ఎడమ కాలువకు గండ్లు పడడంతో పాటు చెరువులకు పడిన గండ్ల విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ హుటాహుటిన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సంఘటనా స్థలాలను సందర్శించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

నష్ట నివరణా చర్యలలో భాగంగా చెరువులు, కాలువలు, పంప్ హౌజ్ లు మరియు చెక్ డ్యామ్ లపునరుద్ధరణకై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆర్ధిక అధికారాలను వినియోగించుకుని జీ. ఓ నెం. 45 ద్వారా నిధులు మంజూరు చేశారు. అంచనాలు రూపొందించడంతో పాటు పరిపాలనా అనుమతులు, ఆర్ధిక శాఖ అనుమతులలో ఎక్కడా జాప్యం జరగకుండా ఉండేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తానే స్వయంగా రంగంలోకి దిగి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరిపి నిర్ణిత వ్యవధిలో మంజూరీ లు ఇప్పించి పునరుద్ధరణ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 773 చోట్ల చెరువులకు, కాలువలకు గండ్లు పడటంతో పాటు జరిగిన నష్టాన్ని అధికారులు గుర్తించినారు.

ఖరీఫ్ పంటను కాపాడడంతో పాటు నీటి సరఫరాను కొనసాగించేందుకు మంత్రి ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తో పాటు ఇ.ఎన్.సి లు అనిల్ కుమార్, నాగేందర్ రావు లతో పాటు చీఫ్ ఇంజినీర్లతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ జరిగిన నష్టం తాలూకు అంచనాలను పూర్తి స్థాయిలో రూపొందించారు. తాజా వర్షాలకు నీటిపారుదల శాఖలో జరిగిన నష్టానికి కేంద్రప్రభుత్వం సహాయం కోరుతూ నివేదికను పంపారు. తాత్కాలిక మరమ్మతులకు రూ. 75 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.483 కోట్లు అంచనాతో రూపొందించిన నివేదికను కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అంద జేసింది. తాజాగా కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 773 చోట్ల కాలువలు, చెరువులకు గండ్లు పడడంతో పాటు వరద ఉధృతికి దెబ్బ తిన్నట్లు గుర్తించారు. అందులో చిన్న నీటిపారుదల పరిధిలోని చెరువులకు 265 చోట్ల గండ్లు పడగా 285 చెరువులు దెబ్బతిన్నాయి. అదే విదంగా భారీ నీటిపారుదలతో పాటు మధ్యతరహ ప్రాజెక్టుల నీటిపారుదల కు చెందిన కాలువలకు 132 చోట్ల గుండ్లు పడగా 83 చోట్ల దెబ్బతిన్నాయి.

ఇవి గాకుండా నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామ సమీపంలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన విషయం తెలిసిందే. అదే విదంగా ఖమ్మంను ముంచెత్తిన వరద ప్రభావంతో భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పంప్ హౌస్ మునిగి పోయి పంప్ హౌస్ పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారీ, మధ్య తరహా ప్రాజెక్టులలో 94 ప్రాజెక్ట్ లలో నీటి నిల్వలు పూర్తి స్థాయి సామర్ధ్యానికి చేరుకున్నాయి.ఇప్పటి వరకు అన్నీ ప్రాజెక్ట్ లలో ఔట్ ఫ్లో,ఇన్ ఫ్లోలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.లోతట్టు ప్రాంతాలను రక్షించడానికి అవసరమైన అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు.

వీటన్నింటినీ సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా యుద్ద ప్రాతిపదికన తాత్కాలిక పద్దతితో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు ఆదేశించారు. అంతే గాకుండా ఇదే వర్షపు ఉధృతికి గండి పడిన కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం కాగితం రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువను హుజూర్‌నగర్ మండలం కరక్కాయలగూడెం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ తో పాటు కోదాడ మండలం ఆర్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్లకుంట మేజర్ మఠంపల్లి మండలం చెరువులను ఈ ఆదివారం స్వయంగా పరిశీలించేందుకు గాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూట్ మ్యాప్ రూపొందించు కున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News