Friday, October 18, 2024

హరిత భారతే అంతిమ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

ఒడిశాలో 7వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్
2030 నాటికి ఒడిశాలో కోటి చెట్ల పెంపకమే లక్షం
ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒడిశా స్పీకర్
1500 పండ్ల మొక్కలను నాటిన విద్యార్థులు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశాన్ని హరితమయంగా మార్చే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఏడో విడత భువనేశ్వర్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం రోజున భువనేశ్వర్‌లోని ఐఆర్‌సి గ్రామంలోని ప్రభుత్వ పాథశాలలో ఒడిశా అసెంబ్లీ స్పీకర్ సురమా పాధి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సోమవారం రోజున ఖుర్దా జిల్లా పరిధిలోని కైపాదర్‌లోని శ్రీ జగన్నాథ్ కాలేజీలో కొనసాగింది. రెండో రోజు కూడా నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఒడిశా స్పీకర్ చేతులు మీదుగా…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎస్‌జే కళాశాల విద్యార్థులు 1500కు పైగా పండ్ల మొక్కలను నాటారు. అవి పెరిగి పెద్దయ్యే వరకు బాధ్యత తీసుకుంటామనీ, 2030 నాటికి ఒడిశాలో 1 కోటి చెట్లను పెంచడమే లక్షంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములమవుతామని ప్రతిజ్ఞ చేశారు. భూమినే చల్లగా ఉంచుదాం.. జీవజాతులను కాపాడుదాం అనే థీమ్‌తో ప్రారంభమైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో తామే కాదు, మిగతా అందరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇగ్నయిటింగ్ మైండ్స్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రేరణ ఇంటర్నేషనల్ అండ్ అయలిటిక్ ట్రస్ట్ సహకారం అందించాయి. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ఇగ్నయిటింగ్ మైండ్స్ సహ వ్యవస్థాపకులు ఎం.కరుణాకర్‌రెడ్డి, రాఘవ సంజీవుల తదితరులు పాల్గొన్నారు.

జీవజాతులను కాపాడుదాం
భూమిని చల్లగా ఉంచుదాం.. జీవజాతులను కాపాడుదాం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్వాహకులు సూచించారు. స్థానికులకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి అవగాహన కల్పించారు. ఒడిశాలో 2030 నాటికి 1 కోటి చెట్లను పెంచడమే లక్షం అని తెలిపారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి.. స్థితిస్థాపకతను సృష్టించి ప్రజలను కాపాడటానికి, దేశమంతటా బిలియన్ చెట్లను పెంచడం కోసం ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుందని తెలిపారు. గ్లోబల్ గ్రీన్‌హౌస్ వాయువుల మూడవ అతిపెద్ద ఉద్గారిణిగా ఉన్న భారతదేశం, 2070 నాటికి నికర శూన్య ఉద్గారాలకు మారుతున్నప్పుడు ఆర్థిక వృద్ధిని కొనసాగించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, దాని వివిధ కార్యక్రమాలైన వర్షపు నీటి సంరక్షణ, చెట్ల పెంపకం వంటి కార్యక్రమాల ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కొని, నీటి అభద్రత, అటవీ, జీవవైవిధ్య నష్టం, తీవ్రమైన వేడి తరంగాలు, వ్యవసాయ సవాళ్లు, వేగవంతమైన పట్టణీకరణతో సహా క్లిష్టమైన వాతావరణ సంక్షోభాలు వంటి సమస్యలను పరిష్కరించడమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్షంగా పెట్టుకుందని వివరించారు.

ఒడిశాలోనే ఎందుకంటే…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో 19.52 కోట్ల చెట్లను విజయవంతంగా నాటారు. ఈ కార్యక్రమం ఉద్దేశం బాగుందని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు దీంట్లో భాగస్వాములైన విషయం మనకు తెలిసిందే. ఇగ్నైటింగ్ మైండ్స్ ఒడిశా నాయకుడు ప్రొఫెసర్ ప్రపుల్ల దల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆవశ్యకతను వివరించారు. ఒడిశాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గల కారణాలను తెలియజేశారు. జాతీయ జనాభాలో కేవలం 3.47%, భారతదేశ భౌగోళిక ప్రాంతంలో 3% కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఒడిశా భారతదేశం మొత్తం గ్రీన్‌హౌస్ వాయువులలో 9.3% విడుదల చేస్తుంది. ఇది దేశంలోనే అత్యధిక తలసరి ఉద్గార రేటు. మే 2024 చివరి నాటికి అత్యధిక హీట్‌వేవ్ రోజులను (27 కంటే ఎక్కువ) నమోదు చేసిన రాష్ట్రం. వాతావరణ విపత్తులు పొంచి ఉన్నాయి.

కాబట్టి ఇప్పటికిప్పుడు ఒక నిర్ధిష్టమైన లక్షాన్ని పెట్టుకోకపోతే ఒడిశా మనుగడ ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఎంచుకున్నట్లు వివరించారు. 2010లో ఒడిశాలో 1.85 మిలియన్ హెక్టార్ల సహజ అడవులు ఉన్నాయని, దాని భూభాగంలో 12% ఆక్రమణకు గురయ్యాయని గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ 2024 నివేదికలో పేర్కొన్నట్లు ప్రొఫెసర్ ధాల్ చెప్పారు. 2023 నాటికి, రాష్ట్రం 11.5 వేల హెక్టార్ల సహజ అడవులను కోల్పోయింది. ఇది 5.52 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాలకు సమానం. ఇటీవల గ్రీన్ కవరేజ్ పెరుగుతున్నప్పటికీ, రాష్ట్ర అటవీ, పచ్చదనాన్ని పునరుద్ధరించడానికి మరిన్ని ప్రయత్నాలు అవసరం అని అన్నారు.

అడవుల పునర్నిర్మాణం కోసం
ట్రీ మ్యాన్ ఆఫ్ ఒడిశా, గ్రీన్ ఆర్మీ ప్రెసిడెంట్ డాక్టర్ దిలీప్ శ్రీచందన్ అడవుల పెంపకం, ఆగ్రోఫారెస్ట్రీ, అటవీ పెంపకంలో ప్రభుత్వ కార్యక్రమా లను ఆప్టిమైజ్ చేయడానికి సహకార ప్రయత్నాల ప్రాముఖ్యతను వివరించారు. ‘ఇటీవలి కాలంలో అనేక చెట్ల పెంపకం కార్యక్రమాలతో రాష్ట్ర జీవావరణ శాస్త్రాన్ని పునరుద్ధరించడంలో ప్రభుత్వ కృషిని గుర్తించాం. ఏదేమైనా, ఒడిశా తన చారిత్రక అటవీ, పచ్చదనాన్ని తిరిగి పొందడానికి మరిన్ని చెట్లను నాటాలి. దీనికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఒడిశాలో అడవుల పునర్నిర్మాణానికి దోహదం చేస్తుందన్నారు. ఇంతటి మహత్తరమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో వ్యక్తులు, కమ్యూనిటీలు, సంస్థలను చేరాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చెట్లను నాటడం వల్ల దేశాన్ని పచ్చగా, ఆరోగ్యవంతంగా మార్చొచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News