గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో చిత్తు
మన తెలంగాణ/ హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమై మరో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టైటాన్స్ సారథి శుభ్మన్ గిల్(61 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(49), షేర్ఫన్స్ రూథర్ఫార్డ్(35 నాటౌట్)లు రాణించడంతో సన్రైజర్స్ నిర్దిశించిన లక్షాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో గుజరాత్ ఐపిఎల్18లో మూడో విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్లోనే రెండు వరుస బౌండరీలతో దూకుడు కనబర్చిన ట్రావిస్ హెడ్.. చివరి బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్(17)తో అభిషేక్ శర్మ(18) దూకుడుగా ఆడాడు. కానీ అతని దూకుడుకు సిరాజ్ బ్రేక్ వేసాడు. క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలోనే సన్రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. ఆచితూచి ఆడుతున్న ఇషాన్ కిషన్(17)ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్కు వచ్చిన హెన్రీచ్ క్లాసెన్(27) దూకుడుగా ఆడాడు. మరో ఎండ్లో నితీష్ ఆచితూచి ఆడినా క్లాసెన్ తనదైన షాట్లతో అలరించాడు.
50 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని సాయి కిషోర్ విడదీసాడు. స్టన్నింగ్ డెలివరీతో క్లాసెన్ను క్లీన్ బౌల్ చేశాడు. తన మరుసటి ఓవర్లోనే నితీష్ కుమార్ రెడ్డి(31)ని కూడా సాయి కిషోర్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి సన్రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కామిందు మెండీస్(1) తీవ్రంగా నిరాశపర్చగా.. అనికేత్ వర్మ(18)ను సిరాజ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. సిమర్జిత్ సింగ్ను క్లీన్ బౌల్ చేసి సిరాజ్ తన ఖాతాలో నాలుగో వికెట్ వేసుకున్నాడు. క్రీజులోకి వచ్చిన షమీ సాయంతో ప్యాట్ కమిన్స్ జట్టు స్కోర్ను 150 పరుగులు ధాటించాడు.