పాకిస్థాన్లోని అల్లకల్లోల బలూచిస్థాన్లో పంజాబ్ ప్రాంతానికి చెందిన ఎనిమిదిమందిని అనుమానిత తిరుగుబాటుదారులు బస్సు నుంచి దింపి, ఆపై కాల్చి చంపారని అధికారులు గురువారం తెలిపారు. ఈ దాడి గ్వాదర్ జిల్లాలో జరిగింది. గ్వాదర్ నుంచి కరాచీ వెళుతున్న ప్రయాణీకుల బస్సును సాయుధులు బుధవారం రాత్రి ఒర్మరా హైవేలో ఆపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ హఫీజ్ బలూచ్ తెలిపారు. తీవ్రవాదులు బస్సు ప్రయాణికులను దించేశాక ఎనిమిది మందిని మాత్రం కాల్చి చంపేశారని సమాచారం.
‘తిరుగుబాటుదారులు ఐడి కార్డులు తనిఖీ చేసి ఎనిమిది మందిని చంపేశారు, మరి ముగ్గురిని తమ వెంట తీసుకెళ్లారు’ అని ఆయన వివరించారు. ఇంత వరకు ఈ పనిచేసింది తామేనని ఏ గ్రూప్ చెప్పుకోలేదు. తిరుగుబాటుదారులు బ్లాక్ చేసి హైవే వద్దకు భద్రతా సిబ్బంది వెళ్లినట్లు సమాచారం. ప్రయాణీకుల బస్సుపై దాడిని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటనపై పరిశోధన జరిపి, బాధ్యులను ప్రాసిక్యూట్ చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.