Monday, September 23, 2024

బిఆఎస్ హయాంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వచ్చాకనే ఆగిన ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి అయిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను హరీశ్ రావు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. ఎల్లంపల్లి ప్రజెక్టు తామే పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గొప్పలు చెప్పకోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురై, పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిన ఎల్లంపల్లి ప్రాజెక్టును బిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చిందన్న విషయాన్ని మరిచిపోతున్నారని అన్నారు. పేరుకే బ్యారేజి పూర్తి చేశారు తప్ప నీళ్లు నింపింది లేదు, రైతులకు ఇచ్చింది లేదని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలను గాలికి వదిలేశారని అన్నారు. ఎఫ్ ఆర్ ఎల్ 148 మీటర్ల వరకు భూసేకరణ కాలేదు అని, పునరావాస కాలనీలు

పూర్తి చేయకపోవడంతో ముంపులోకి వచ్చిన గ్రామాల తరలింపు జరగలేదని పేర్కొన్నారు. కరీంనగర్ – మంచిర్యాల రాజీవ్ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించలేదు అని, 144 మీటర్లకు నీరు చేరితే పాత లోలెవెల్ బ్రిడ్జ్ మునిగిపోయేదని.. రాకపోకలు బంద్ అయ్యేవి అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి బ్యారేజి పూర్తి అయినా ఈ కారణాల వలన పూర్తి స్థాయిలో నీరు నింపలేక నిరుపయోగంగా ఉండిపోయిందని, తెలంగాణ వచ్చాకనే పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి చేసి, ముంపు బాధితులకు నష్ట పరిహారం చెల్లించి, ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కాలనీలకు తరలించి, రాజీవ్ రహదారిపై వేగంగా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ఎల్లంపల్లి జలాశయంలో ఎఫ్ ఆర్ ఎల్ 148 మీటర్ల వరకు 20 టిఎంసిల నీటిని నింపామని వివరించారు. అది బిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత అని వ్యాఖ్యానించారు.

ఇది బిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత : తెలంగాణ వచ్చాకనే పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి చేసి, ముంపు బాధితులకు పరిహారం చెల్లించామని హరీశ్‌రావు తెలిపారు. రాజీవ్ రహదారిపై వేగంగా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ఎల్లంపల్లి జలాశయంలో ఎఫ్.ఆర్.ఎల్ 148 మీటర్ల వరకు 20 టిఎంసిల నీటిని నింపామని వివరించారు. ఇది బిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వం భూసేకరణ, పునరావాసం, హైలెవెల్ బ్రిడ్జి, రహదార్ల నిర్మాణం కోసం రూ.2,052 కోట్లను వెచ్చించిందని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ హయాంలోనే బ్యారెజ్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చామని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి ప్రాజెక్టును ఒక కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చిన తర్వాతనే జలాశయం మీద ఆధారపడిన అన్ని ప్రాంతాలకు నీటిని అందించే పని ప్రారంభం అయిందని వెల్లడించారు. ఇదంతా జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాతనే అన్న వాస్తవాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తించకపోయినా కరీంనగర్ రైతులకు తెలుసునని చెప్పారు. తాళం వేసితిని .. గొళ్ళెం మరచితిని అన్నట్టు మీరు అన్ని ప్రాజెక్టులను అప్పగించినట్టు ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా నిరుపయోగంగా తమకు అప్పగించితే దాన్ని రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చిమని హరీశ్‌రావు తెలిపారు.

మంత్రి ఉత్తమ్ చెప్పింది అబద్ధమైతే ప్రివిలేజ్ మోషన్ : మొత్తం మీద గత నాలుగేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థ ద్వారా సుమారు 20,33,572 ఎకరాలకు సాగునీరు అందిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారన్నారు. ఇది అబద్ధమైతే ఈ అబద్ధాలు చెప్పి శాసన సభ్యులను తప్పుదోవ పట్టించినందుకు ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయం మీద మంత్రి పొన్నం వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News