Thursday, September 19, 2024

పట్టపగలే ఎంఎల్ఎపై దాడి… హేయమైన చర్య: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ  హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.  ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి అని ఆరోపణలు చేశారు.

సిఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని హరీష్ రావు ధ్వజమెత్తారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిన విషయం సుస్పష్టంగా ఉందని, ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు నిలువరించడంలో  విఫలమయ్యారని విమర్శించారు. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని హరీష్ రావు కోరారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంఎల్ఎ కౌశిక్‌రెడ్డి సవాల్ నేపథ్యంలో ఆయన ఇంటికి అరెకపూడి గాంధీ వెళ్లారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ తన అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News