Thursday, February 6, 2025

కాంగ్రెస్ పాపం రైతన్నలకు శాపంగా మారింది:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

రైతు భరోసా విషయంలో చేసింది గోరంత, చెప్పకునేది కొండంత అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతులందరికీ ఎకరాకు 7,500 రైతు భరోసా అని, దాన్ని ఎకరాకు 6 వేలకు కుదించారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా విదిల్చి ఇచ్చిన మాట మీద నిలబడ్డట్లు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులుంటే, 21,45,330 మందికి రైతు భరోసా వేసినట్లు చెప్పుకుంటున్నారని, మరి మిగతా 47లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి..? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. 2023 వానాకాలానికి సంబంధించి, బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరం లోపు ఉన్న రైతు సంఖ్య 22,55,181గా గుర్తించి, రైతు బంధు అందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 21,45,330 మందిగా గుర్తించిందని, అంటే 1,09,851 మంది రైతులకు కోత విధించిందని పేర్కొన్నారు.

లక్ష పైగా రైతులకు ఎందుకు రైతు భరోసా లేకుండా చేసారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల సమాధానం చెప్పాలని అడిగారు. ప్రభుత్వం చెబుతున్న నిర్ణీత కాల వ్యవధి అంటే ఎప్పుడో కూడా చెప్పాలని అన్నారు. ఇప్పుడు తీసుకుంటే 10 వేలు, డిసెంబర్ 9, 2023 నాడు తీసుకుంటే రైతు భరోసా 15వేలు అన్నారని, అధికారంలోకి రాగానే వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి, రైతన్నకు భరోసా లేకుండా చేశారని మండిపడ్డారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తమన్నరు, మాట మార్చి 26, జనవరికి అన్నరు…అది కూడా కాదని మార్చి 31 వరకు ఇస్తమని ప్రకటించాని తెలిపారు.

కాంగ్రెస్ పాపం రైతన్నలకు శాపంగా మారింది
నాట్లు వేసే కంటే ముందే కెసిఆర్ పంట పెట్టుబడి సాయంగా రైతు బంధు అందిస్తే, కాంగ్రెస్ పాలనలో కోతల కాలం వచ్చినా రైతు భరోసా వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని హరీష్‌రావు అన్నారు. ఈ ప్రభుత్వానికి లబ్ధిదారుల్లో కోతలు విధించడంపై ఉన్న దృష్టి, రైతులు, పేదల సంక్షేమం పట్ల ఏమాత్రం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాపం రైతన్నలకు శాపంగా మారిందని, 14 నెలల పాలనలో 415పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా రాలేదని ఒకరు, అప్పు కట్టలేదని ఇంకొకరు, బ్యాంకుల వేధింపులు భరించలేక మరొకరు.. ఇలా రాష్ట్రంలో రైతన్నల చావులు నిత్యకృత్యం అవుతున్నా ప్రభుత్వం

మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ, రైతు భరోసా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నదని ఆరోపించారు. 2023 యాసంగిలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 2,500, 2024 వానాకాలంలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7,500, ఈ యాసంగికి ఒక్కో ఎకరానికి ఇవ్వాల్సిన 7,500 కలుపుకొని మొత్తం ఒక్కో రైతుకు ఎకరానికి 17,500 చొప్పున బాకీ పడింది కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ బాకీని ఇంకెప్పుడు తీర్చుతారని నిలదీశారు. లబ్ధిదారుల జాబితాలో కోత విధించిన లక్ష మంది రైతులతో పాటు, మిగతా రైతులందరికీ వెంటనే రైతు భరోసా సాయం అందించాలని హరీష్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News