Wednesday, July 3, 2024

ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట.. ఆధికారంలో ఉంటే మరో మాట:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకొని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూసినట్లు బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా ఉసూరుమనిపించారని ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో వివిధ శాఖల్లో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి నిరుద్యోగులు ఓటేశారని,

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు దాటిందని, బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలను ఇచ్చారు తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అలమటించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. గ్రూప్ 1, డిఎస్‌సి తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బంది కరంగా మారిందని పేర్కొన్నారు. నిరుద్యోగుల విజ్ఞప్తిని కనీసం వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.

గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి
గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చామని, వాటికి మరో 60 ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ వేయడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మెయిన్స్‌కు 1 : 50 నిష్పత్తిలో కాకుండా, 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరారు. 1: 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్తేమీ కాదని, గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని గుర్తు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో 1:15 గా పేర్కొన్నప్పటికీ, తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారని తెలిపారు. గ్రూప్ 1 పరీక్ష అనేది యు.పి.ఎస్.సి. మాదిరిగా ప్రతి సంవత్సరం ఉండదు అని, రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష కావడం వల్ల ఆశావహుల సంఖ్య పెరిగిందని అన్నారు.

గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తితో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని తెలిపారు. సిఎల్‌పి నేతగా నాడు భట్టి విక్రమార్క ఇదే డిమాండ్ చేశారని, ఇప్పుడు ఆ వైఖరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు తప్పుకుంటుందో అర్థం కావడం లేదని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట ఆధికారంలో ఉంటే వేరొకమాటగా ప్రవర్తించడం ఎందుకని ప్రశ్నించారు. గ్రూప్ 2కు 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3000 ఉద్యోగాలు కలుపుతామన్న మాటను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షల మధ్య తక్కువ విరామం ఉండడంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని అభ్యర్థులు అంటున్నారని హరీశ్‌రావు వెల్లడించారు. ఆ ఒత్తిడితోనే సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకుందని తెలిపారు. ఉద్యోగ నియామకాల పరీక్షల తేదీల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలన్నారు. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ హామీకి అనుగుణంగా అడుగులు పడటంలేదని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇచ్చిన మాటకు కట్టుబడాలి
25 వేల పోస్టులతో మెగా డిఎస్‌సి అని 11 వేల పోస్టులతోనే ఇచ్చి మోసం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడాలని సూచించారు. హామీ ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి బకాయిలతో పాటు చెల్లించాలని తెలిపారు. జిఒ 46 రద్దు చేస్తామని నమ్మించి, అధికారంలోకి వచ్చాక నట్టేటముంచి, నియామక ప్రక్రియ పూర్తిచేశారని దుయ్యబట్టారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది మరో నిదర్శనమన్నారు. వెంటనే జిఒ 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలు పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News