రేవంత్ రెడ్డి మాటలు ఘనంగా ఉంటే, చేతలు హీనంగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. మాటలు కోటలు దాటితే అడుగు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం, మాటిచ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మార్చి 31 కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో వేస్తామని జనవరి 26న గొప్పగా ప్రకటించారని, మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి 31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురుచూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైందని అన్నారు. రైతులను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు అంటూ సిఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రైతు భరోసా అమలుపై మాట తప్పిన సిఎం రేవంత్ రెడ్డి వైఖరి పట్ల హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
దసరాకిస్తమన్నరు, ఇవ్వలేదు…సంక్రాంతికి ఇస్తమన్నరు, ఇవ్వలేదు…ఉగాదికి ఇస్తామని ఊరించి రైతుల్ని ఉసూరుమనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది అని మండిపడ్డారు. కెసిఆర్ నాట్ల సమయంలో రైతుబంధు ఇస్తే, రేవంత్ రెడ్డి కోతల సమయం వచ్చినా రైతు భరోసా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. మోసమే తన విధానంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రైతుల్ని అన్ని కోణాల్లో దగా చేస్తున్నారని, రుణమాఫీని దారుణ వంచనగా మార్చారని విమర్శించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడటం లేదు అని, డేట్లు మారుతున్నాయి, డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప, రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు, అసెంబ్లీలో ప్రకటించినట్లు రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా, రైతు భరోసా ఇచ్చే దాకా బిఆర్ఎస్ పార్టీ రేవంత్రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉంటుంది అని, ఎక్కడిక్కడ నిలదీస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటుందని హరీష్రావు స్పష్టం చేశారు.