Tuesday, September 17, 2024

నాలాపై గేటెడ్ కమ్యూనిటీ.. మోకిలా విలవిల్లా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/శంకర్‌పల్లి : నగరానికి దూరంగా ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసిదామని కోట్లు పెట్టి కొన్నా రు…తీరా భారీ వర్షానికి వెంచర్ నిండా నీరు చేరడంతో 48 గంటలుగా నరక యాతన పడుతున్నారు. గతంలో ముంపు సమస్య నగరాని కే పరిమితం కాగా అక్రమార్కుల పుణ్యమా అంటూ సహజ వనరుల విధ్వంసంతో ఇపుడు పచ్చని గ్రామాలకి చేరింది. వివరాల్లోకి వె ళితే.. రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, మోకిలా గ్రామ పంచాయతీ పరిధిలోని లాపలోమా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో సుమారు 4 నుండి 5 కోట్ల వరకు విలువ చేసే సుమారు 212 విల్లాలు ఉన్నాయి. అందులో సుమారు 1000 మందికి పైగా నివసిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో గతంలో చెరువు ఉండేదని కాలువ ద్వారా నీరు చేరేదని స్థానికులు వాపోతున్నా రు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్గానికి కాలనీ అంతా జలమయం అయింది. రెం డు రోజులుగా మోకాల్లోతు నీళ్లలో ఉంటున్నామ,ని దోమలు తదితర వాటితో రోగాల బారిన పడే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.

అందమైన బ్రోచర్లు, ఫొటోలు చూడటంతో పాటు హెచ్‌ఎండిఏ అనుమతులు చూసుకుని, బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని ఇళ్లు కొనడం, నిర్మించుకున్నామన్లి విల్లాల్లో నివాసం ఉంటున్న వారు పేర్కొంటున్నారు. సహజసిద్ధమైన చెరువులు, నాలాలు మూసుకుపోవటంతో ఈ విధంగా నీరు ముంచెత్తింది. వెంచర్ల వారు ఎక్కడికక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవటంతో ఈ పరిస్థితులు దాపురించాయని వాపోయారు. తీరా ముంపు సమస్య రావటంతో గ్రామ పంచాయతీకి టాక్స్‌లు కడుతున్నాం.. మా సమస్యకు పరిష్కారం చూపాలని లాపలోమ బాధితులు కోరుతున్నారు. ఇరిగేషన్ అధికారులు సైతం నాలా ఉండటంతో ముంపు సమస్య వచ్చిందన్నారు. మోకిలా పరిధిలోని గొట్టిముక్కుల కుంట నిండిన తర్వాత అల్మాస్ కుంట, సీత కుంటకు నీరు చేరుతుందని, కానీ ఈ ప్రాంతంలో వచ్చిన వెంచర్లతో చెరువులు, కాలువలు మాయం అయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు..అధికారులు గతంలో ముడుపులు తీసుకొని అక్రమంగా అనుమతులు ఇవ్వటంతో ఈ పరిస్థితి దాపురించిందని మోకీల వాసులు ఆరోపిస్తున్నారు.

ఆక్రమణలు ఉంటే హైడ్రా వస్తుంది: ఎమ్మెల్యే కాలే యాదయ్య
మోకిలాలోని లోపలోమా ముంపు ప్రాంతాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా విల్లాల బాధితులు పైప్ లైన్లు వేసి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నాలాలు, చెరువుల్లో ఆక్రమణలు ఉంటే హైడ్రా వస్తుందన్నారు. నాలలాలో వెంచర్ ఉందని రెండేళ్ల కిందటే రిపోర్ట్ ఇచ్చాం..ఇరిగేషన్ ఏఈ రాధిక ఈ వెంచర్ నాలాలో ఉంద,ని రెండేళ్ల కిందటే సర్వే చేసి హెచ్‌ఎండిఏకు నివేదిక ఇచ్చినట్లు ఇరిగేషన్ ఏఈ రాధిక తెలిపారు. డిఎల్‌పిఓ సతీష్, తహశీల్దార్ సురేందర్, ఎంపిడివో వెంకన్న గౌడ్, ఎంపిఓ గిరిరాజ్ ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. వరద నీటిని బయటకు పంపాలని బాధితులు కోరారు.

చెరువులు, నాలాల ఆక్రమణలతో ముంపు సమస్య: మాజీ సర్పంచ్ సుమిత్ర మోహన్ రెడ్డి
గొట్టిముక్కుల కుంట నిండిన తర్వాత అల్మాస్‌కుంట, సీతకుంటకు నీరు చేరుతుందని, ఈ నీళ్లన్నీ రోడ్డు పక్కన చెరువులోకి చేరేవన్నారు. సర్వే నంబర్ 196, 198, 103, 104, 106లలో విల్లాలు, వెంచర్లు రావటంతో నీరు మొత్తం అక్కడ అక్రమంగా కట్టిన విల్లాలకు చేరుతుందన్నారు.
కోట్లు పెట్టి కొన్నాం… ముంపు సమస్యను పరిష్కరించండి.: లాపలోమ విల్లాల యజమానులు…
ప్రభుత్వంలోని అన్ని శాఖల నుండి అనుమతులు ఉండటంతో కోట్ల రూపాయలు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేసి కుటుంబాలతో కలిసి నివాసం ఉంటున్నామని యజమానులు వాపోయారు. వెంచర్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేతో పాటు, అధికారులు, మీడియా ప్రతినిధులను కలిసి వారు గోడు వెళ్లబోసుకున్నారు. హెచ్‌ఎండిఏ అనుమతులు ఉండటంతో ఇక్కడ విల్లాలు కొని అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని పేర్కొన్నారు.. నీరు తమ గేటెడ్ కమ్యూనిటీలోకి రాకుండా పైప్‌లైన్ వేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News