పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. రాష్ట్రంలో మూడు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని వివరించారు. తెలంగాణకు ఆనుకుని ద్రోణి ఏర్పడిందని, ఉపరితల అవర్తనం కారణంగా రాష్ట్రంలో తేమ గాలులు వీస్తున్నాయని శ్రీనివాస్ తెలిపారు. అవి వీయడం వల్ల మేఘాలు ఏర్పడి సాయంత్రం వర్షాలు పడుతున్నాయని వివరించారు.
తిరిగి ఉదయం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. రాజస్థాన్ నుంచి కోస్తాకు వెళ్తున్న ఉపరితల అవర్తనం కారణంగా తెలంగాణలో వానలు పడే అవకాశముందని, ఈ సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, జల్లులు పడతాయన్నారు. రాబోయే నాలుగు రోజులు కూడా గత 30 ఏళ్ల నుంచి ఉష్ణోగ్రతలకు అటు ఇటుగా 1 డిగ్రీ పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. ద్రోణి, ఉపరితల అవర్తనం కారణంగా తేమ గాలులు ప్రవేశించి వర్షాలు కురుస్తున్నాయన్న ఆయన వాతావరణంలోని వేడిని తగ్గించే అంత తేమ గాలులు వీయడం లేదని వివరించారు. మేఘాల్లో అనిశ్చతి ఏర్పడడం, మరోవైపు తేమగాలులు నీటి బిందువులుగా ఏర్పడి, మంచుగా మారుతాయని, అప్పుడు వాటికి పాజిటివ్, నెగటివ్ ఛార్జీలు డెవలప్ అవుతాయని, దీని డిశ్చార్జీనే మెరుపు, పిడుగులు అంటారని, ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
తెలంగాణలో భిన్నమైన వాతావరణం : తెలంగాణ లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. దీంతో ఉత్తర తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్నారు. గత ఏడాది ఏప్రిల్ తో పోలిస్తే 1 నుంచి 2 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. శనివారం సైతం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దీనికి తోడు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.