Sunday, July 7, 2024

ఉత్తరాఖండ్‌లో వర్షబీభత్సం.. 100 రహదారులు మూసివేత

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. చంపావత్, అల్మోరా, పిథోర్‌గఢ్, ఉదమ్‌సింగ్ నగర్‌తోపాటు కుమాన్ తదితర ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

డెహ్రాడూన్, తేహ్రి, హరిద్వార్ తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గంగా, అలకసంద, భాగీరథీ, శారద, మందాకిని, కోసి నదుల్లో నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నదులను ఆనుకొని ఉన్న దాదాపు 100 రహదారులను అధికారులు మూసివేశారు.

నీట మునిగిన శివుడి విగ్రహం
గత 24 గంటల్లో అల్మోరా లోని చౌకుతియా ప్రాంతంలో 72.5 మిమీ వర్షపాతం నమోదైంది. లోహఘట్ లో 59.మిమీ, చంపావత్‌లో 45 మిమీ, కాశీపుర్‌లో 42 మిమీ, హల్‌ద్వానీలో 31 మిమీ వర్షపాతం నమోదైంది. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ్ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నైనితాల్, పౌడీ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

ఎలాంటి విపత్తు తలెత్తినా, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను జిల్లా మెజిస్ట్రేట్స్ ఆదేశించారు. గంగా, సరయూ నదులు ప్రమాదకర స్థాయికి కొంచెం దిగువన ప్రవహిస్తుండగా, అలకనంద, మందాకిని , భాగీరథి నదులు ఇప్పటికే ఆ స్థాయిని దాటేశాయి. మరోవైపు గోమతి, కాళీ, గౌరీ,శారద నదుల ప్రవాహం కూడా భారీగా పెరుగుతోంది. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడడంతో బద్రీనాథ్, యమునోత్రి, ధర్చులా , తవాఘాట్ జాతీయ రహదారుల పైనా రాకపోకలు నిలిచి పోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News