నేడు అల్పపీడనం, రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఇది తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారి రాజారావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు.
Heavy rains expected in Telangana