Thursday, October 3, 2024

జార్ఖండ్‌లో హిందువులు , ఆదివాసీ జనాభాకు గండి

- Advertisement -
- Advertisement -

జెఎంఎం ఓట్ల రాజకీయంతో ఉనికికి ముప్పు
హజారీబాగ్ బిజెపి పరివర్తన్ యాత్ర సభలో మోడీ
చొరబాటుదార్లను రప్పించి ఇక్కడి మట్టికి ద్రోహం
సంకీర్ణ సర్కారును తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు

హజారీబాగ్ : జార్ఖండ్‌లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని జెంఎఎం సంకీర్ణ ప్రభుత్వ ప్రమాదకర ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. బిజెపి పరివర్తన్ యాత్ర ముగింపు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు అయిన సభలో ప్రధాని మోడీ బుధవారం ప్రసంగించారు. రాష్ట్ర గుర్తింపు, సాంస్కృతిక జానపద కళాత్మక వారసత్వం దెబ్బతినే పరిణామాన్ని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిపెట్టిందని ఆయన పేర్కొన్నారు. చొరబాటు దార్లను యధేచ్చగా ఇక్కడికి రానిస్తున్నారు. దీనితో క్రమేపీ స్థానికుల జనాభా తగ్గుముఖం పడుతోంది. ఇది ఎంతటి ప్రమాదకరమనేది అందరూ అర్థం చేసుకోవల్సి ఉందన్నారు.

ఇటువంటి వినాశకర శక్తులను తిప్పికొట్టి, తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమి, బిడ్డ, రొట్టెల పరిరక్షణకు అంతా ఏకం కావల్సి ఉందన్నారు. పార్టీ బలోపేతం, ప్రజల వద్దకు మరింత విస్తరించుకునే క్రమంలో చేపట్టిన పరివర్తన్ యాత్ర రాష్ట్రంలోని 81 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏకంగా దాదాపుగా 5400 కిలోమీటర్ల మేర సాగింది. ఇందులో దశలవారిగా పలువురు బిజెపి నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. చివరి ఘట్టం పూర్తి సందర్భంగా మోడీ తమ సందేశం వెలువరించారు. అవినీతి నిరోధానికి ఇక్కడ పరివర్తన అవసరం ఉంది. అందుకే బిజెపి ప్రజల కోసం ఈ కార్యక్రమం చేపట్టిందని మోడీ చెప్పారు. ఇక్కడి సంకీర్ణపు ప్రభుత్వం చివరికి ఓట్ల కోసం తమ రాజకీయ ప్రయోజనాల కోసం పలు విషయాలలో విచక్షణారహితంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని తెలిపారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ దశలో యువ అభ్యర్తులు దుర్మరణం చెందారు. వారి కుటుంబాలలో విషాదం నిండింది.

అయినా ఇక్కడి ప్రభుత్వం స్పందించలేదని మోడీ తెలిపారు. హజారీబాగ్‌కు రాగానే మోడీ ఇక్కడ ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా వెళ్లినప్పుడు పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు మోడీకి స్వాగతం పలికారు. ఓ చోట మోడీ ఆదివాసీలను కలిసి మాట్లాడారు. వారికి భరోసా ఇచ్చారు. గిరిజన మహిళలు కొందరు ప్రధాని మోడీకి ఈ దశలో ఇక్కడి మట్టితో కూడిన కలశం అందించారు. ఇక్కడి నేలను, ఆడపిల్లలను, రోటిని పరిరక్షించే క్రమంలో మార్పు తీసుకువస్తామని మోడీకి తెలిపారు. సెప్టెంబర్ 20వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలోని సాహిబ్‌గంజ్ నుంచి బిజెపి పరివర్తన్ యాత్రకు పచ్చజెండా చూపి ఆరంభించారు. ఇదే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు యాత్రలు వేర్వేరుగా కదిలాయి. ఇప్పుడు హజారీబాగ్‌లో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News